అప్పుడు సితార.. ఇప్పుడు యువి

Update: 2023-01-19 03:30 GMT
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలు వచ్చినపుడు ఆటోమేటిగ్గా భారీ చిత్రాలు రేసులోకి దిగుతుంటాయి. వాటి మధ్య కొన్ని సందర్భాల్లో చిన్న, మీడియం రేంజి సినిమాలు కూడా తమ ఉనికిని చాటుకోవడం.. మంచి వసూళ్లు రాబట్టడం గతంలో చూశాం. అందుకు మంచి ఉదాహరణ.. 2017లో ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లకు పోటీగా రిలీజై బ్లాక్‌బస్టర్ అయిన ‘శతమానం భవతి’.

దీన్ని ఉదాహరణగా తీసుకుని ప్రతి సంవత్సరం పెద్ద పండుగులప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలను రేసులో నిలుపుతున్నారు నిర్మాతలు. కానీ ఆ మ్యాజిక్ మళ్లీ ఏమీ రిపీట్ కావడం లేదు. ఈ మధ్య రెండు పండుగల విషయమే చేస్తూ.. పెద్ద సినిమాల మధ్య పోటీకి సై అని రెండు పెద్ద బేనర్ల సినిమాలు అన్యాయం అయిపోయాయి.

గత ఏడాది దసరాకు చిరంజీవి, నాగార్జునల సినిమాలు ‘గాడ్ ఫాదర్’, ‘ఘోస్ట్’ బరిలో ఉన్నప్పటికీ.. ధైర్యంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ తన ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. నిజానికి అది మంచి సినిమా. ఇంత పోటీ లేకుండా, వేరే టైంలో వచ్చి ఉంటే మంచి హిట్టయ్యేది. కానీ దసరాకి ఈ సినిమాను ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు.

‘ఘోస్ట్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా కూడా దీనికి కలిసి రాలేదు. జనాల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి యువి వారి ‘కళ్యాణం కమనీయం’ విషయంలోనూ అతివిశ్వాసంతో కొంప మునిగింది. ఇది కనీసం ‘స్వాతిముత్యం’లా విషయం ఉన్న సినిమా కూడా కాదు. థియేటర్లు పెద్దగా అందుబాటులో లేకున్నా.. ఏదో మ్యాజిక్ జరిగిపోతుందని సంక్రాంతికి బరిలో దించారు. కానీ ఈ సినిమా కనీస ప్రభావం చూపలేదు. దీనికి ఇచ్చిన కొన్ని థియేటర్లు, షోలు కూడా వేస్టయిపోయాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలతో పాటు డబ్బింగ్ సినిమాలు తెగింపు, వారసుడు మధ్య ఈ చిన్న సినిమా పచ్చడైపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News