ఫైనల్గా రానా ఓకే చెప్పినట్లేనా..?
రెండు ఏళ్ల ఎదురు చూపులకు రానా ఫుల్ స్టాప్ పెట్టినట్లే అనిపిస్తోంది. కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
టాలీవుడ్ యంగ్ హీరోలు, స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనే ఉత్సాహం తో దూసుకు పోతున్న ఈ సమయంలో రానా మాత్రం చాలా స్లోగా సినిమాలను చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆయన హీరోగా సినిమా రాలేదు. ఆయన చివరగా 2022లో విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయినా రానా కొత్త సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. మధ్యలో రెండు మూడు సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినా, టాక్ షోలో, వెబ్ సిరీస్లో కనిపించినా ఆయన హీరోగా సినిమాలు చేయాలని అభిమానులు ఎక్కువగా కోరుకుంటున్నారు.
రానా కెరీర్ ఆరంభం నుంచి కూడా విభిన్నమైన సినిమాలను చేస్తూ వస్తున్నారు. కథల ఎంపిక విషయం మొదలుకుని ప్రతి విషయంలోనూ ఆయన తన ప్రత్యేక శైలిని కనబర్చుతూ వచ్చారు. హీరోగానే కాకుండా విలన్గా నటించడం, ముఖ్య పాత్రల్లో కనిపించడం, గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం వంటివి చేశారు. ఆయన కోరుకుంటే, గట్టిగా తలుచుకుంటే ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు అయినా చేయగలరు. ఆయనతో సినిమాల కోసం ఎంతో మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. కానీ రానా మాత్రం మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి కథలతో వచ్చిన సినిమాలను సమర్పించేందుకు సైతం రానా ముందుకు వస్తున్నారు.
రెండు ఏళ్ల ఎదురు చూపులకు రానా ఫుల్ స్టాప్ పెట్టినట్లే అనిపిస్తోంది. కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ దర్శకుడు మిత్రన్ దర్శకత్వంలో రానా ఒక సినిమాను చేయబోతున్నాడు. తమిళ్లో మంచి పరిచయాలు ఉన్న రానాకి మిత్రన్ ఇటీవల కథ చెప్పాడని, ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ్లోనూ ఈ సినిమాను సమాంతరంగా రూపొందించే విధంగా దర్శకుడు మిత్రన్ ప్లాన్ చేస్తున్నాడట. తెలుగు, తమిళ్లో రూపొందే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
2022లో కార్తీతో 'సర్దార్' సినిమాను రూపొందించి సక్సెస్ దక్కించుకున్న దర్శకుడు మిత్రన్ తాజాగా అదే సినిమా సీక్వెల్ను రూపొందిస్తున్నారు. 'సర్దార్ 2' సినిమాను ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్దార్ 2 సినిమా విడుదలైన వెంటనే రానాతో సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మిత్రన్ గతంలో మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పాడనే వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. తెలుగులో మరో ఇద్దరు ముగ్గురు హీరోలతోనూ కథా చర్చలు జరిగాయి. కానీ అవి ఏవీ ఫైనల్కి చేరలేదు. కానీ రానాకి మాత్రం చెప్పిన కథకు ఓకే చెప్పడంతో పాటు సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు పెట్టే విధంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి రానా వైపు నుంచి ఈ విషయమై ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.