జమిలి.. మోదీ-షాలకే కలిమి.. గట్టి షాకిస్తున్న విపక్షం!

'ఒక దేశం-ఒకే ఎన్నిక'కు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని కూడా ఆశిస్తోంది

Update: 2024-09-18 13:15 GMT

గత రెండు టర్మ్ లకు భిన్నంగా ఈసారి ఎన్నికల్లో లోక్‌ సభలో బీజేపీకి సొంతగా సంపూర్ణ మెజారిటీ రాలేదు. అయితే, అంతమాత్రాన చాలా కీలక నిర్ణయాల్లో వెనకడుగు వేయడం లేదు. ఇలాంటివాటిలో జమిలి ఎన్నికలు ఒకటి. ఎందుకనో గానీ.. ఈ వియంలో చాలా గట్టి పట్టుదలగా ఉంది. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’కు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని కూడా ఆశిస్తోంది. కానీ.. అదేమీ అంత సులువు కాదని స్పష్టం అవుతోంది.

మోదీ 3.0.. వంద రోజుల సెన్సేషన్

మోదీ మూడో విడత ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగానే అన్నట్లుగా ‘జమిలి ఎన్నికలు’ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలే ఇటీవ వెల్లడించాయు. కాగా, లోక్‌ సభ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల హామీ కూడా ఉండడం గమనార్హం. మరోవైపు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలో అత్యున్నత స్థాయి కమిటీ వేశారు. ఆ కమిటీ లోక్‌ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సమాంతరంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని.. ఇవి పూర్తయిన వంద రోజుల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సూచించింది. సిఫారసుల అమలుకు ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేయాలని కోవింద్‌ కమిటీ ప్రతిపాదించింది. జమిలి ఎన్నికలకు 18 రాజ్యాంగ సవరణలను సూచించింది. వీటిలో ఎక్కువవాటికి రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అక్కర్లేదని వివరించింది.

మంత్రివర్గం ముందుకు..

ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రతిపాదనకు మోదీ మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కోవింద్‌ కమిటీ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. రెండు దశల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. అదే కమిటీ నివేదికను కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. అయితే, ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశంపై పలువురు ప్రతిపక్ష నేతలు ఇది ఆచరణాత్మకం కాదని అంటున్నారు. క్యాబినెట్‌ ఆమోదం తర్వాత కాంగ్రెస్‌ తో పాటు పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఒకే దేశం ఒకే ఎన్నికను అంగీకరించబోరని అన్నారు. ఎన్నికల సమస్యలు సృష్టించి ప్రజలను మళ్లిస్తున్నారని ఆరోపించారు. ‘ఒక దేశం-ఒకే ఎన్నికలు’ ఆచరణాత్మకం కాదన్నారు. మరోవైపు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. “సమాఖ్య వ్యవస్థను నాశనం చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని రాజీపడేలా చేయడం వల్లే ఒకే దేశం-ఒకే ఎన్నికను వ్యతిరేకిస్తున్నట్లు’’ చెప్పారు. బహుళ ఎన్నికలు మోదీ, షాలకు తప్ప ఎవరికీ ఇబ్బంది కాదన్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నందున ఇలా చేస్తున్నారు. సక్రమంగా, ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్య జవాబుదారీతనం కూడా మెరుగుపడుతుంది.” అని రాసుకొచ్చారు.

Tags:    

Similar News