'రియల్' వ్యాపారులకు రేవంత్ భరోసా.. హైడ్రాపై క్లారిటీ ఇచ్చేశారుగా..!

ఎక్కడికక్కడ ప్లాట్ల విక్రయాలు, ఫ్లాట్ల అమ్మకాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

Update: 2024-10-20 10:35 GMT

గత కొన్ని నెలలుగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఎక్కడికక్కడ ప్లాట్ల విక్రయాలు, ఫ్లాట్ల అమ్మకాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. దాంతో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది.

హైదరాబాద్ నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా వెలసిన కట్టడాలను కూల్చడమే లక్ష్యంగా రేవంత్ హైడ్రా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో వైపరీత్యాల వల్ల హైదరాబాద్‌కు ఎలాంటి ప్రమాదం రాకూడదని ఆయన ముందస్తు ఆలోచనతో హైడ్రాను అమల్లోకి తెచ్చారు. దీనికి సీరియన్ ఐపీఎస్ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించారు.

అయితే.. హైడ్రా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని అక్రమ కట్టడాలను కూలుస్తోంది. ఈ కూల్చివేతల్లో పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, పెద్ద పెద్ద భవంతులు, విల్లాలు సైతం ఉన్నాయి. కోట్లాది రూపాయలు పెట్టి కొన్న విల్లాలు సైతం నేలమట్టం అయ్యాయి. అన్ని పర్మిషన్లు ఉన్నాయనుకొని కొనుగోలు చేసిన భవనాలు చివరకు హైడ్రా చేతిలో నేలమట్టం కాకతప్పలేదు. వందలాది సంఖ్యలో ఇళ్లను తొలగించడంతో అందరిలోనూ భయం మొదలైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ల మోసాల వల్ల చాలా మంది కోట్లాది రూపాయలను నష్టపోయారు.

హైడ్రా చర్యలతో ప్రజలు ఇప్పుడు ఆస్తులు కొనుగోలు చేసేందుకు భయాందోళనకు గురవుతున్నారు. దాంతో కంప్లీటుగా నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎవరూ ముందుకు రావడంలేదు. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆందోళనలో పడిపోయారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ అప్పీల్ చేశారు. రియల్ వ్యాపారులకు భరోసానిచ్చారు. రేవంత్ ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రెస్‌మీట్ పెట్టారు. హైడ్రాపై పూర్తి స్పష్టతనిచ్చారు. చట్టబద్ధమైన అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్న వారికి ఎలాంటి భయాందోళన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. చెరువుల వద్ద అనుమతులు ఉన్నా.. నిర్మాణాలు కూల్చివేస్తారని అనవసర ప్రచారం చేస్తున్నారని తెలిపారు. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉంటే వారి జోలికి రామని చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు హైడ్రా కట్టుబడి పనిచేస్తున్నదని వివరించారు.

మరోవైపు ఈ అంశంపై సీఎం రేవంత్ కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసిన వారికి మాత్రమే హైడ్రా ఓ భూతంలాంటిదని చెప్పుకొచ్చారు. వారి పట్ల హైడ్రా ఓ అంకుశంలా పనిచేస్తుందన్నారు. కేటీఆర్, హరీశ్ రావులు వారి ఫౌంహౌజ్‌లను కాపాడుకునేందుకే పేదలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మూలాలను ప్రశ్నార్థకం చేయడానికి చూస్తున్నారని పేర్కొ్నారు. ముఖ్యమంత్రి, హైడ్రా కమిషనర్ ఎట్టకేలకు కూల్చివేతలపై ఓ క్లారిటీ ఇవ్వడంతో రియల్ వ్యాపారుల్లో కొంత వరకు భరోసా వచ్చింది. ఇటు ప్రజల్లోనూ ఉన్న అనుమానాలు తొలగినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News