గ‌మ‌నికః కొత్త ఉద్యోగాలు లేనట్లే!

Update: 2017-11-20 23:30 GMT
ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవ‌కాశాల‌పై ఇక నుంచి ఆశ పెట్టుకోవ‌డం త‌గ్గించుకోవాల్సిందే. ఇదేదో ఆషామాషీగా చెప్తున్న‌మాట కాదు..ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేదిక చేసిన విశ్లేష‌ణ ఆధారంగా ఇస్తున్న స‌మాచారం. దేశంలో ప్రైవేటు రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక పెద్దగా లేనట్లే. దేశీయ కంపెనీలు వేతనాల వ్యయాన్ని నియంత్రించడానికి కీలక ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో మిగిలిన కాలంలో కొత్త ఉద్యోగాల కల్పన పెద్దగా ఉండబోదని అసోచామ్ తేల్చిచెప్పింది.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మూలధనాన్ని సమకూర్చిన తరువాత ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తమ ఉద్యోగుల వేతనాల వ్యయాన్ని తగ్గించుకుంటాయని, అందువల్ల కొత్త ఉద్యోగాల కల్పన తగ్గుతుందని తెలిపింది.

ఉద్యోగాల క‌ల్ప‌న‌పై  తన సభ్యుల నుంచి స్వీకరించిన గణాంకాల ఆధారంగా అసోచామ్ ఈ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం పనితీరును మెరుగుపరచుకోవడం - పటిష్ఠం కావడం - ప్రధానం కాని వ్యాపారాల నుంచి బయటపడటం -బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచుకోవడంపై బ్యాంకులు దృష్టి పెట్టాయని అసోచామ్ తెలిపింది. వచ్చే మూడు నెలల నుంచి ఆరు నెలల కాలంలో కార్పొరేట్ కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడంలో - రుణ వ్యయాన్ని తగ్గించుకోవడంలో నిమగ్నమయి ఉంటాయని అసోచామ్ పేర్కొంది. ప్రధానంగా టెలికాంతో పాటు ప్రైవేటు బ్యాంకులు - నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సహా ఆర్థిక సేవా సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - స్థిరాస్థి రంగం - వౌలిక సౌకర్యాల రంగాల్లో వేతనాల వ్యయాన్ని తగ్గించుకోవడం, లాభాలను పెంచుకోవడంపై కసరత్తు సాగుతోందని అసోచామ్ తెలిపింది.

మూడీస్ భారత సావరిన్ రేటింగ్‌ ను పెంచడం సానుకూలాంశంగా మారినప్పటికీ - వచ్చే రెండు త్రైమాసికాలు ప్రైవేటు రంగానికి సవాలుగానే ఉంటాయని అసోచామ్ సెక్రెటరి జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. అయితే 2018 ఏప్రిల్ నుంచి పరిస్థితులు కుదుట పడతాయని - అధిక రుణభారం - వినియోగదారుల నుంచి నెమ్మదించిన డిమాండ్ వంటి అంశాలు కొంత వరకు చక్కబడతాయని పేర్కొన్నారు. అనుకోని అవాంఛనీయ ఘటనలు ఏమైనా సంభవిస్తే తప్ప, 2018-19 ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్నా మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.
Tags:    

Similar News