బీజేపీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..క‌శ్మీర్‌ కు హిందూ సీఎం

Update: 2018-07-09 17:22 GMT
క‌ల్లోల క‌శ్మీర్ మ‌రోమారు వార్త‌ల్లోకి ఎక్కింది. ఈ ద‌ఫా ఉగ్ర‌వాదుల దాడులో..ఓ వ‌ర్గం వారి ఆందోళ‌న కార‌ణంగానో కాకుండా...బీజేపీ ఎంపీ ఒక‌రు చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌తో క‌శ్మీర్ ప‌తాక శీర్షిక‌కు చేరింది. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంలో పెట్టింది పేర‌యిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య‌స్వామి క‌శ్మీర్ విష‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ముంబైలో విరాట్ హిందుస్థాన్ సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్ర‌మ‌ణ్య‌స్వామి  జమ్మూకశ్మీర్‌ కు ఓ హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని  అభిప్రాయపడ్డారు. బీజేపీకి మరో అయిదేళ్ల అధికారం ఇస్తే - తన ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీజేపీ-పీడీపీ పొత్తుతో జ‌మ్ముక‌శ్మీర్‌ లో ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గా...జూన్‌ 19న పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మద్దతు విరమించుకోవడంతో సీఎం మహబూబా ముప్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్‌ లో గవర్నర్‌ పాలన విధించారు. ఈ ప‌రిణామాల‌పై తాజాగా సుబ్ర‌మ‌ణ్య‌స్వామి స్పందిస్తూ కశ్మీర్‌ కు కేవలం ముస్లింలనే సీఎం చేయాలని నిబంధన విధించిన మాజీ ప్రధాని జవహర్‌ లాల్ నెహ్రూ నిర్ణయాన్ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తప్పుపట్టారు. జమ్మూకశ్మీర్‌ కు ఓ హిందూ మతస్థుడు సీఎం కావాలని - ఒకవేళ పీడీపీ పార్టీలో ఎవరైనా హిందువు లేదా సిక్కు వ్యక్తి ఉన్నా వారిని సీఎంగా చేయాలని ఆయన సూచించారు.  నెహ్రూ విధించిన నిబంధన సహించలేమన్నారు. ఆర్థిక అభివృద్ధి నినాదం బీజేపీకి విజయాన్ని అందించదని, హిందుత్వ ఎజెండా మాత్రమే ఆ పార్టీని ఆదుకుంటుందన్నారు. వాజ్‌పేయి చేపట్టిన ఇండియా షైనింగ్ ప్రచారం బీజేపీని దారుణంగా దెబ్బతీసిందని ఆయన గుర్తు చేశారు. హిందుత్వ స్థాపన, అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అందుకే 2014లో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు.
Tags:    

Similar News