వెంకయ్యను ఆవిడ బాగా అర్థం చేసుకున్నారట

Update: 2016-09-17 07:50 GMT
ప్రత్యేక హోదా వ్యవహారంలో అందరితోనూ తిట్లు తింటున్న రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత - కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆ విషయంలో చాలా ఆవేదన చెందుతున్నారు. విభజన కాలం నుంచి తాను ఏపీ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నా ఎవరూ అర్తం చేసుకోకుండా ఆడిపోసుకుంటున్నారంటూ పదేపదే బాధపడుతున్నారు. అయితే... కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పేసిన తరువాత ప్యాకేజీ సాధన విషయంలోనూ తాను ఎంతో కృషి చేశానని... ఆ కృషి బీజేపీ నేత పురంధేశ్వరి అందరి కంటే ముందు అర్థం చేసుకున్నారని వెంకయ్య చెబుతున్నారు. ప్యాకేజీ బాటలో తన మాటలను పురంధేశ్వరి అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ కి ప్యాకేజీని సాధించినందుకు ఏపీ బీజేపీ నేతలు వెంకయ్యను సత్కరించిన సందర్భంలో ఆయన ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను కాపాడ‌డంలో తాను ముందే ఉంటాన‌ని చెప్పిన ఆయన ప్రత్యేక హోదా అంశంలో త‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శలను తిప్పికొట్టారు.  తాను ప్రత్యేక హోదా - ప్యాకేజీ కోసం చేస్తోన్న ప్రయ‌త్నంలో త‌న మాట‌ల‌ను బీజేపీ రాష్ట్ర నాయ‌కురాలు పురంధేశ్వరి అంద‌రి కంటే ముందుగా అర్థం చేసుకున్నార‌ని... క‌నీసం పోల‌వ‌రం ప్రాజెక్టు కోస‌మైనా ప‌ట్టుబ‌ట్టాలని ఆమె తనను కోరారని... ఆమె కోరిక ప్రకారం చివ‌రికి పోల‌వరం సాధ్యమైంద‌ని వెంకయ్య చెప్పారు.

1972 లోనే ఏపీని విభ‌జించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ‌చిత్రం ఇప్పుడు వేరుగా ఉండేదని వెంక‌య్యనాయుడు అన్నారు. గ‌తంలో జై ఆంధ్ర ఉద్యమంలో తానూ పాల్గొన్నానని... ఆ ఉద్యమాన్ని నీరుగార్చింది కాంగ్రెస్సేన‌ని అన్నారు. అన్ని అంశాల‌ను ప‌రిశీలించ‌కుండా కాంగ్రెస్ రాష్ట్ర విభ‌జ‌న చేసింద‌ని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చినందుకు దాని ప‌ట్ల ప్రజ‌లు సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. విభ‌జ‌నకు తాను అనుకూల‌మే కానీ ఏపీకి న్యాయం జ‌ర‌గాల‌ని ఆనాడు ప‌ట్టుబ‌ట్టానని... ఏపీకి న్యాయం జ‌రిగేవ‌ర‌కు వెన‌కాడేది లేద‌ని అప్పట్లో అద్వానీకి తాను ముందే చెప్పానని గత చరిత్రంతా ఆయన చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News