418 కేజీల వెండితో జగన్ మీద అభిమానాన్ని చాటాడు

Update: 2021-10-08 05:22 GMT
తాము అభిమానించే వారికి.. తమకున్న అభిమానాన్ని ప్రదర్శించుకోవటం కోసం విపరీతంగా తపిస్తుంటారు. మరి.. తాము అభిమానించి.. ఆరాధించే అధినేత విషయంలో తమకున్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రదర్శిస్తుంటారు. తాజాగా అలాంటి అభిమానం 418 కేజీల వెండితో తయారైన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. పలు సంక్షేమ పథకాలతో ఆసక్తికరంగా మారిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించాడో నేత.

ఓవైపు ఆర్థిక సమస్యలు సవాళ్లు విసురుతున్నా.. నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నా.. వాటికి వెరవక తాను అనుకున్న పనిని అనుకున్నట్లుగా పూర్తి చేసే విషయంలో సీఎం జగన్ మిగిలిన వారి కంటే ఎంతో ముందుంటారన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మీద తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటాలని భావించారు నెల్లూరు నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్.

వెండి ఆభరణాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. ఇందుకోసం 418 కేజీల వెండిని ఉపయోగించారు. సీఎం మీద తనకున్న అభిమానాన్ని ఇంత భారీగా ప్రదర్శించి అందరూ అభినందించేలా వ్యవహరించారు. తనకున్న అభిమానం ఎంత ఎక్కువన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఇందుకోసం కోయంబత్తూరులోని కళ్యాణ మండపంలో వెండి ఆభరణాలతో భారీ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. ఇందుకోసం 12 గంటల పాటు శ్రమించినట్లుగా చెబుతున్నారు. ‘మహానాయకునికి.. మన:పూర్వకంగా’ అంటూ తనకున్న అభిమానాన్ని ప్రదర్శించారు.


Tags:    

Similar News