పార్ట‌మెంట్‌లో అక్కినేని కుటుంబం.. కార‌ణ‌మిదే!

ఓవైపు అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన `తండేల్` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. పాన్ ఇండియా రిలీజ్ కోసం రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో నాగ‌చైత‌న్య బిజీబిజీగా ఉన్నారు.

Update: 2025-02-07 09:29 GMT

ఓవైపు అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన `తండేల్` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. పాన్ ఇండియా రిలీజ్ కోసం రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో నాగ‌చైత‌న్య బిజీబిజీగా ఉన్నారు. ఇంత‌లోనే అక్కినేని కుటుంబం స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. దిల్లీ పార్లమెంటులోని తెలుగు దేశం పార్టీ ( టిడిపి) కార్యాలయంలో నాగార్జున, ఆయ‌న‌ కుటుంబ సభ్యులతో క‌లిసి ఉన్న ఫోటోను నంద్యాల తేదేపా ఎంపీ డా. బైరెడ్డి శబరి సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా ఈ ఆక‌స్మిక స‌మావేశానికి కార‌ణ‌మేమిటా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. దిల్లీ నుంచి వచ్చిన ఫోటోలో నాగ‌చైత‌న్య‌- శోభిత , నాగార్జున - అమ‌ల దంప‌తులతో బైరెడ్డి కలిసి కనిపించారు.


అయితే అక్కినేని కుటుంబం ఇలా దిల్లీలో ప్ర‌త్య‌క్షం కావ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంది. తెలుగు సినీప‌రిశ్ర‌మ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా అక్కినేని కుటుంబం దిల్లీకి వెళ్లింది. ఈ కార్యక్రమం తెలుగు సినిమా చరిత్రలో అత్యంత గౌరవనీయమైన నటులలో ఒకరైన ఏఎన్నార్ కు నివాళి. ఇప్ప‌టికే సోషల్ మీడియాలో ఈ స‌మావేశానికి కార‌ణాన్ని తెలియ‌జేసారు. ``అక్కినేని కుటుంబం పుస్తకావిష్కరణ కోసం ఢిల్లీలో ఉంది..అని #ANRLivesOn అనే హ్యాష్‌ట్యాగ్‌తో వివ‌రాల్ని వెల్ల‌డించారు. పుస్తకావిష్కరణతో పాటు అక్కినేని కుటుంబం రాజకీయ నాయకులను కూడా కలిసింది. అయితే దీనికి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త లేదు.

తెలుగు సినీప‌రిశ్ర‌మ దిగ్గ‌జ న‌టుల్లో ఒక‌రు ఏఎన్నార్. దాదాపు 250 కి పైగా చిత్రాలలో నటించిన ఆయ‌న తన బహుముఖ ప్రజ్ఞతో ప‌రిశ్ర‌మ అభివృద్ధికి స‌హ‌క‌రించారు. తెలుగు సినిమాకు ఆయ‌న చేసిన‌ కృషికి ఇప్ప‌టికే గుర్తింపు ద‌క్కింది. అక్కినేని పేరుతో పోస్ట‌ల్ స్టాంపుల్ని ప్ర‌భుత్వం ముద్రించింది. ప‌ద్మ పుర‌స్కారాల‌తోను స‌త్క‌రించింది. పుస్తకావిష్కరణలో అక్కినేని అద్భుతమైన వారసత్వం, చిత్ర పరిశ్రమపై శాశ్వత ప్రభావానికి గౌర‌వం ద‌క్కింది.

Tags:    

Similar News