'మంచు' వారి ప్రొడక్షన్ లో ప్రియదర్శి ఒరిజినల్ మూవీ..?

Update: 2020-05-17 08:00 GMT
'పెళ్లి చూపులు' సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు ప్రియదర్శి. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రియదర్శి విభిన్నమైన విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. ఒక వైపున కమెడియన్ గా నవ్విస్తూనే.. మరో వైపున కీలకమైన పాత్రలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'అర్జున్ రెడ్డి' 'కణం' 'తొలిప్రేమ' 'అ' 'గ్యాంగ్ లీడర్' 'వరల్డ్ ఫేమస్' 'బ్రోచేవారెవరురా' లాంటి సినిమాలలో తన విలక్షణమైన నటనతో అలరించాడు దర్శి. స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ బిజీ యాక్టర్‌ గా మారిన ప్రియదర్శి హీరోగానూ ‘మల్లేశం’ అనే చిత్రంలో చేశారు. ఆ సినిమాలో అతని నటనకి అందరూ ఫిదా అయ్యారనే చెప్పాలి. ఆ తర్వాత 'మిఠాయి' అనే సినిమాలో కూడా లీడ్ రోల్ పోషించాడు. తాజాగా ప్రియదర్శి జీ 5 ఓటీటీలో ప్రదర్శించబడుతున్న 'లూజర్' అనే వెబ్ సిరీస్ లో నటించాడు. అక్కినేని నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) మరియు జీ 5 వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో దర్శి నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శి అన్ని రకాల పాత్రలను చేయగలడని అనిపించుకోవాలని.. కామెడీ చేయడం చాలా తేలికని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి కామెడీ చేయడమే చాలా కష్టం. ఆ విషయంలోను మంచి మార్కులు తెచ్చుకున్నాను. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నంలో వున్నాను. ఇక విలన్ పాత్రలు కూడా చేయాలని వుంది. నటుడిగా నిరూపించుకోవాలంటే అన్నిరకాల పాత్రలు చేయాలనేదే నా ఉద్దేశం అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ప్రియదర్శి మరో మూవీలో కీలక పాత్ర చేసే అవకాశం వచ్చిందట. తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కబోతున్న ఓ ఒరిజినల్ మూవీలో ప్రియదర్శి లీడ్ రోల్ పోషించబోతున్నాడట. ఒక ప్రముఖ ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మంచు విష్ణు ఈ మూవీ నిర్మాణానికి పూనుకున్నాడట. దీని గురించి ప్రస్తుతం అధికారికంగా ప్రకటించినప్పటికీ లాక్ డౌన్ ఎత్తేసే సమయానికి విష్ణు ప్రకటించే అవకాశం ఉందట. మొత్తం మీద కమెడియన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గానూ చేస్తూ విభిన్న నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం 'వి' 'జాతి రత్నాలు' ప్రభాస్ సినిమాలలో కనిపించనున్నాడు ప్రియదర్శి.


Tags:    

Similar News