జైలులో ఖైదీలతో కలిసి డ్యాన్స్ చేసిన రియా చక్రవర్తి..!

Update: 2022-10-21 01:30 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన కేసులో ఎక్కువగా వినిపించిన పేరు రియా చక్రవర్తి. సుశాంత్‌ ప్రియురాలిగా చెప్పబడిన రియా.. అతని మృతికి ప్రధాన కారణమంటూ తీవ్ర అరోపణలు ఎదుర్కొంది. ఈ క్రమంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడింది. అనేక పరిణామాలు చోటుచేసుకున్న తర్వాత దాదాపు నెల రోజుల జైలు జీవితం గడిపి రియా బెయిల్‌ పై విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే 2020లో రియా చక్రవర్తి ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నప్పుడు సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్ ఆమెను కలిశారు. ఆమె జైలులో ఉన్న సమయంలో రియా తో సమావేశం గురించి ఇటీవల వెల్లడించారు. జైల్లో రియాను చూశానని పేర్కొన్న సుధ.. అక్కడ ఇతర ఖైదీలతో రియా ఎలా కలిసిపోయిందనే విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు జైలులో తన చివరి రోజు డ్యాన్స్ కూడా చేసిందని తెలిపింది.

సుధా భరద్వాజ్ మానవ హక్కుల న్యాయవాది మరియు ట్రేడ్ యూనియనిస్ట్. భీమా కోరేగావ్ కేసులో అరెస్టయి మూడేళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత.. సుధా గతేడాది డిసెంబర్‌ లో విడుదలయ్యారు. అయితే జైలులో ఉన్నప్పుడు రియా చక్రవర్తిని చూశానని ఇటీవల ఓ సందర్భంలో చెప్పింది. మీడియా ట్రయిల్స్.. విమర్శలను రియా చాలా స్పోర్టివ్  గా తీసుకుందని మరియు ఆ సమయంలో బైకుల్లా జైలులోని ఖైదీలతో చాలా స్నేహపూర్వకంగా ఉండేదని సుధ వెల్లడించారు.

''సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ విషయం మీడియాలో క్రేజీగా సాగుతూనే ఉంది. అప్పట్లో రియాను బలిపశువుగా చేస్తున్నామని చెప్పుకునేవాళ్లం. మేము దానితో చాలా అసంతృప్తి చెందాము. కాబట్టి, ఆమెను ప్రధాన బ్యారక్‌ లోకి తీసుకురానందుకు నేను చాలా సంతోషించాను. ఆమెను ఒక ప్రత్యేకమైన సెల్‌ లో ఉంచారు. టీవీ చూడకుండా ఉండాలని ఆమెను అక్కడ ఉంచారని నేను అనుకుంటున్నాను. టీవీని ఆన్‌ లో ఉంచుతారు కాబట్టి.. ఆ కేసు గురించి విన్నప్పుడల్లా ఆమె చాలా కలత చెందుతుంది'' అని సుధ ఓ బాలీవుడ్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

రియా చక్రవర్తి ఖాతాలో కొంత డబ్బు మిగిలి ఉందని.. వాటితో జైలులోని ఖైదీలకు స్వీట్లు ఇవ్వమని కోరిందని సుధ తెలిపింది. చివరి రోజు అందరూ ఆమెకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారని.. 'వన్ డ్యాన్స్‌.. వన్‌ డ్యాన్స్‌' అని అందరూ అడగడంతో.., రియా వారితో కలిసి డ్యాన్స్‌ చేసిందని సుధా భరద్వాజ్‌ చెప్పుకొచ్చింది.

ఇకపోతే జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన రియా చక్రవర్తి.. తిరిగి సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ - ఇమ్రాన్‌ హష్మీలతో కలిసి 'చెహ్రే' అనే హిందీ చిత్రంలో నటించింది. అప్పటి నుంచి ట్విట్టర్ కు పూర్తిగా దూరం అయ్యింది. చివరగా 2022 జులైలో సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ ఎంక్వరీ వేయమని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ని కోరుతూ ట్వీట్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఎప్పటిలాగే యాక్టీవ్ గా ఉంటూ వస్తోంది.

రియా చక్రవర్తి 'తూనీగ తూనీగ' అనే తెలుగు చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో రియా కు కూడా గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ 'మేరే డాడ్ కీ మారుతి' 'సోనాలీ కేబుల్' 'దుబారా: సీ యువర్ ఈవిల్' 'బ్యాంక్ చోర్‌' 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' 'జలేబీ' వంటి హిందీ సినిమాల్లో నటించింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన 'సూపర్ మచ్చి' సినిమాలో హీరోయిన్ గా ముందు రియా చక్రవర్తినే తీసుకున్నారు. అయితే కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకుందని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News