సూపర్‌ స్టార్‌ సినిమాలో ముగ్గురు సూపర్‌ డైరెక్టర్స్‌?

రాజకీయాల్లో అడుగు పెట్టిన విజయ్‌ సినిమాల్లో నటించను అంటూ తేల్చి చెప్పారు. జన నాయగన్ తన చివరి సినిమా అంటూ విజయ్ పలు సందర్భాల్లో ప్రకటించారు.;

Update: 2025-03-12 09:00 GMT

సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్న చివరి సినిమా 'జన నాయగన్‌' షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. హెచ్ వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గురించి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ప్రముఖంగా ఈ సినిమా బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. మెయిన్‌ స్టోరీ లైన్‌ను తీసుకుని దర్శకుడు హెచ్ వినోద్‌ తమిళ్‌ ఆడియన్స్‌ అభిరుచికి తగ్గట్లుగా, విజయ్ ఇమేజ్‌కి మ్యాచ్ అయ్యే విధంగా స్క్రిప్ట్‌ను రెడీ చేసి షూటింగ్‌ మొదలు పెట్టినట్లు సమాచారం అందుతోంది. అనధికారిక రీమేక్‌గా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాజకీయాల్లో అడుగు పెట్టిన విజయ్‌ సినిమాల్లో నటించను అంటూ తేల్చి చెప్పారు. జన నాయగన్ తన చివరి సినిమా అంటూ విజయ్ పలు సందర్భాల్లో ప్రకటించారు. రాజకీయాల్లో ఫలితం ఎలా ఉంటుందో అనే విషయం ఆలోచించకుండా విజయ్ తన సినీ కెరీర్‌కి గుడ్‌ బై చెప్పేశారు. ఫలితాలు పాజిటివ్‌గా వస్తాయనే నమ్మకంతో ఆయన ఉన్నారు. అందుకే సినిమాలకు స్వస్తి చెప్పారని తెలుస్తోంది. విజయ్‌ సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. పైగా ఇది చివరి సినిమా కావడంతో అంచనాలు మరింత ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఆ అంచనాలు మరింతగా పెంచడం కోసం మేకర్స్‌ ఈ సినిమాలో గెస్ట్‌లను దించబోతున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్‌, హెచ్‌ వినోద్‌ కాంబోలో రూపొందుతున్న జన నాయగన్‌ సినిమాలో ప్రముఖ స్టార్‌ దర్శకులు అయిన అట్లీ, లోకేష్ కనగరాజ్‌, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌లు కనిపించబోతున్నారు. వీరు ప్రత్యేక అతిథి పాత్రల్లో కనిపించడం ద్వారా సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జన నాయగన్‌ సినిమాతో ఇండస్ట్రీకి గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని భావిస్తున్న విజయ్‌ కోసం ఈ ముగ్గురు దర్శకులు తమ వంతు సహకారం అన్నట్లుగా సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది.

జయ నాయగన్ సినిమాలో విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. భగవంత్‌ కేసరి సినిమాలో శ్రీలీల పోషించిన పాత్రను జన నాయగన్‌లో ప్రేమలు బ్యూటీ మమిత బైజు పోషిస్తుంది. ఇంకా సినిమాలో బాబీ డియోల్‌, ప్రకాష్ రాజ్‌, ప్రియమణి, గౌతమ్‌ మీనన్‌ ఇంకా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. విజయ్ రాజకీయంగా బిజీ కానున్న నేపథ్యంలో ఆయన నుంచి సినిమాలు రావు. కనుక ఫ్యాన్స్ ఈ సినిమాను పండుగ మాదిరిగా సెలబ్రేట్‌ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News