ఆప్ నాయకత్వం ఆమెకేనా ?

ఆప్ అన్న పార్టీ పరిస్థితి ఉవ్వెత్తున ఎగిసి చతికిలపడిన చందంగా మారింది.

Update: 2025-02-09 01:30 GMT

ఆప్ అన్న పార్టీ పరిస్థితి ఉవ్వెత్తున ఎగిసి చతికిలపడిన చందంగా మారింది. ఏ అవినీతిని అయితే ఒక ఆయుధంగా మార్చుకుని జనాల మనసు చూరగొని ఆప్ పార్టీని పెట్టి ఏకంగా పదేళ్ళకు పైగా అధికారం చలాయించారో అదే అవినీతి ఆరోపణల విషయంలో జనాల ఆగ్రహానికి గురి అయి భారీ ఓటమిని చవిచూడడం ఆప్ కి ఇపుడు విధి విచిత్రంగా మారింది.

ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్న అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా దేశ రాజకీయాల్లో దూసుకుని వచ్చారు. ఆయన 2012లో పార్టీని పెడితే ఏడాది తిరగకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రికార్డు క్రియేట్ చేశారు.

అయితే ఆనాడు ఆప్ కి 28 సీట్లే రావడం కాంగ్రెస్ తో కలసి సంకీర్ణం ఏర్పాటు చేసినా పొసగకపోవడంతో 48 రోజులు మాత్రమే క్రేజీవాల్ సీఎం గా ఉన్నారు. అలా తొలి దఫా కొంత విజయమే దక్కినా 2015, 2020లో మాత్రం ఆప్ బ్రహ్మాండమైన మెజారిటీని సొంతంగా సాధించింది. ఫలితంగా ఢిల్లీని పదేళ్ళ పాటు కేజ్రీవాల్ సీఎం గా పాలించగలిగారు.

ఆయన హయాంలో ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన శీష్ మహల్ అన్న భవంతిని నిర్మించుకున్నారని అది విలావంతమైనదని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు జనాలు నమ్మారు. అలాగే లిక్కర్ స్కాం విషయంలో కూడా నిజముందని అనుకున్నారు. అందుకే ఈ ఫలితాలు వచ్చారు.

ఇక కేజ్రీవాల్ అవినీతి చేయలేదని ఆప్ నేతలు ఎంత చెప్పినా బీజేపీ సాగించిన శక్తివంతమైన ప్రచారం దానికి తోడు అన్నా హజారే సైతం కేజ్రీవాల్ ని తప్పుపట్టడంతో అది జనంలోకి బలంగా పాతుకుని పోయింది. ఏది ఏమైనా కేజ్రీవాల్ కి ముందున్నది గడ్డు పరీక్ష అని అంటున్నారు.

ఆయన జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత తన సీఎం పదవిని రాజీనామా చేసి అతిషీని కొత్త సీఎం చేశారు. ఇపుడు ఆయన ఏకంగా ఎమ్మెల్యే సీటు నుంచే ఓటమి చూశారు. అంతే కాదు ఆయన పార్టీ పరాజయం పాలు అయింది. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే ఆప్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద సిట్ ని వేస్తామని చెబుతోంది. ఇవన్నీ చూస్తూంటే కేజ్రీవాల్ ని కేసుల ఉచ్చులోలోకి దించుతారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆప్ శాసనసభ పక్ష నేతగా మాజీ సీఎం అతిషీనే ఉంటారని అంటున్నారు. దానితో పాటు ఆప్ జాతీయ కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఆయన బీజేపీకి టార్గెట్ కాబట్టి పార్టీ నిలబడాలీ అంటే కనుక కచ్చితంగా సమర్ధుడైన మరో నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారా అన్నది కూడా చర్చగా సాగుతోంది.

ఓటమి తరువాత కేజ్రీవాల్ తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ చేసేందుకే అని గతాన్ని గుర్తు చేసుకుని కాస్త భావోద్వేగానికి గురి అయ్యారు. మరి ఆయనకు అధికారం పదవుల మీద ఆశ అని ఒకనాటి గురువు అన్నా హజారే లాంటి వారే అంటున్న వేళ కేజ్రీవాల్ కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకుంటే కనుక ఆప్ నాయకత్వం బాధ్యతలు కూడా అతిషీకే వెళ్తాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒక వేళ ఆమె కాకపోతే ఆయన సతీమణికి అయినా ఈ బాధ్యతలు అప్పగించి తాను పార్టీలో ఒక నాయకుడిగా ఉంటూ మళ్ళీ క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం.

Tags:    

Similar News