బీసీ బ్రాండ్... వైసీపీ టీడీపీ బిగ్ సౌండ్

Update: 2022-04-11 07:49 GMT
బీసీలు. ఇపుడు ఏపీలో బిగ్గరగా  మారు మోరుతున్న  రాజకీయ నినాదం. ఎన్నికల్లో గెలవాలీ అంటే సోషల్ ఇంజనీరింగ్ ముఖ్యం అని గత కొన్నాళ్ళుగా తేలుతున్న సత్యం. దానికి జనాల్లో పెరిగిన చైతన్యమే కారణం. దాంతో అతి పెద్ద సామాజికవర్గాలను అక్కున చేర్చుకునే పనిలో రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి.

ఉమ్మడి ఏపీలో చూస్తే కాంగ్రెస్ ఏలుబడిలో బీసీలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. దాంతో ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని పెడుతూనే వారిని దువ్వారు. అలా టీడీపీతో రాజకీయాల్లో ఉన్నత స్థానాలను అందుకున్న బీసీలు దశాబ్దాల తరబడి ఆ పార్టీ కొమ్ము కాశారు. విభజన ముందు దాకా తీసుకుంటే కాంగ్రెస్  టీడీపీల మధ్యనే భీకర  పోరు ఉండేది.

అప్పట్లో కాంగ్రెస్ కి ఎస్సీ ఎస్టీ, మైనారిటీలు సపోర్టుగా ఉంటే బీసీలు టీడీపీకి వెన్నుదన్నుగా ఉండేవారు. ఇక ఏపీ రెండు గా విభజించాక నవ్యాంధ్రలో సామాజిక వర్గాల సమీకరణలు మరింతగా ముందుకు దూసుకువచ్చాయి. ఆ విధంగా ఆలోచిస్తే కనుక బీసీలు టీడీపీని 2014 దాకా అంటిపెట్టుకుని ఆ పార్టీకే ఓటు వేశారు. అయితే టీడీపీ కాపులను కూడా మరో వైపు దగ్గర చేసుకుంది.

ఈ రెండు అతి పెద్ద సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకోలేక టీడీపీ పడ్డ పాట్లతో బీసీలు ఫస్ట్ టైమ్ 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు వచ్చారు. అలా వచ్చిన వారితోనే బంపర్ విక్టరీ వైసీపీ సొంతం అయింది. ఇపుడు చూస్తే బీసీలను వెనక్కు పోనీయకుండా గట్టి రాజకీయ సామాజిక బంధం పెనవేయాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది.

దాని ఫలితమే గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రివర్గంలో పెద్ద ఎత్తున బీసీలు చోటు దక్కించుకున్నారు. బీసీల కోసం కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం, లోకల్ బాడీ ఎన్నికల్లో భారీ వాటాగా సీట్లు ఇవ్వడంతో మొదలైన వైసీపీ రాజకీయం మలివిడత మంత్రి వర్గ విస్తరణతో తారస్థాయికి చేరింది.

ఆరు నూరు అయినా బీసీలను తన వెంటే ఉంచుకోవాలన్న వైసీపీ వ్యూహాలకు ప్రతిబింబమే తాజా మంత్రి వర్గంలో బీసీలకు అతి పెద్ద వాటా. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బీసీలతో కూడిన బలంతో గెలవాలని చూస్తోంది. అదే టైమ్ లో కలసి వస్తే కాపులను కూడా వెంట తీసుకెళ్ళాలనుకుంటోంది.

ఇదంతా క్లియర్ గా జగన్ సోషల్ ఇంజనీరింగ్  పాలిటిక్స్ అని చెప్పాలి. అదే టైమ్ లో బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని వైసీపీ గట్టిగా నినదిస్తోంది. టీడీపీ హయాంలో వారి శాతం మంత్రివర్గంలో 48 అయితే వైసీపీ ఏలుబడిలో 68 శాతంగా పెంచామని గుర్తు చేస్తోంది. ఒక విధంగా ఏపీలో బీసీలను ట్రంప్ కార్డ్ గా వాడుకోవాలని వైసీపీ సిద్ధమైనట్లుగానే ఉంది.

ఇక బీసీలు మా డీఎన్ఏ లోనే ఉన్నారని చంద్రబాబు అంటున్నారు. బీసీలకు రాజకీయంగా అన్ని అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే అని ఆయన గట్టిగా చెబుతున్నారు. బీసీలను టీడీపీ నుంచి ఎవరూ విడదీయలేరు అని బాబు చెబుతున్నారు. ఒక విధంగా టీడీపీ వారి పుట్టిల్లు అని ఆయన బిగ్ సౌండ్ చేస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తూంటే వైసీపీ మంత్రి వర్గం కూర్పు టీడీపీలో చర్చకు దారితీస్తోంది అనే అర్ధం చేసుకోవాలి. బీసీలు మా వైపు అంటే మా వైపు అని రెండు పార్టీలు గట్టిగానే చెప్పుకుంటున్నాయి. ఇంతకీ బీసీ బ్రాండ్ ఎవరి సొంతం. ఎవరు బీసీల ఫుల్ సపోర్ట్ పొందుతారు అన్నది తెలియాలీ అంటే 2024 దాకా వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News