వైరస్ కరాళ నృత్యం: ఐదు లక్షలకు చేరువలో కేసులు
వైరస్ భారత్ లో కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను గడగడ వణికిస్తోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. రోజూ రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 16,922 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 418 మరణాలు సంభవించాయి.
తాజా వాటితో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,73,105కి చేరుకుంది. త్వరలోనే 5 లక్షలకు కేసులు చేరనున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసులు 1,86,514 ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వైరస్ తో 14,476 మంది మరణించారు. వైరస్ నుంచి కోలుకుని 2,71,697 మంది డిశ్చార్జయ్యారు. తాజాగా ఒక్క రోజులో 13,012 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు.
కేసుల నమోదుతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. త్వరలోనే ఐదు లక్షలకు చేరువ కానున్నాయి. ఈ విధంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. స్వీయ జాగ్రత్తలు తీసుకుని వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్రం గా ఉంది. అత్యధికం గా కేసులు ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి.