మనదగ్గరే కాదు.. అమెరికాలోనూ కక్ష రాజకీయాలుంటాయ్

Update: 2022-08-09 07:30 GMT
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020లో జరిగిన ఎన్నికల్లో తుదికంటా పోరాడారు. ఓ దశలో అంతా ఆయనదే విజయం అనుకున్నారు. కానీ, జో బైడెన్ పుంజుకొని గెలుపొందారు.అయితే.. ఓటమితో కుంగిపోని ట్రంప్.. ఆ వెంటనే తాను 2024 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో 78 ఏళ్ల వయసులోనూ ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు స్పష్టమైంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ వయసు 79 ఏళ్లు. రెండున్నరేళ్లలో జరుగనున్నఎన్నికల సమయానికి ఆయనకు 81 దాటుతాయి. దీన్నిబట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో బైడెన్ పోటీ చేయకపోవచ్చు. ట్రంప్ మాత్రం తాను పోటీచేయనున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వానికి రిపబ్లికన్ పార్టీలో పోటీ ఎదురైతే తప్ప ట్రంప్ మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండే అవకాశాలున్నాయి.

ఆయన అవకాశాలను దెబ్బతీయాలని..ట్రంప్ అపర కుబేరుడు అనే సంగతి తెలిసిందే. ఆయనకు భారీ వ్యాపారాలున్నాయి. అందుకుతగ్గట్టే భారీగా ఎస్టేట్లున్నాయి. ఆయన వ్యాపారాలపై గతంలో ఎన్నో ఆరోపణలొచ్చాయి. అవి వీగిపోయాయా..? లేదా? అనే విషయం పక్కనపెడితే.. ట్రంప్ అమెరికా అధ్యక్షుల్లోకెల్లా అత్యంత ధనవంతుడని చెప్పొచ్చు. ఇక ఆయనకు ఉన్న ఆస్తుల్లో మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌ ఒకటి. ఇ అమెరికా సన్ షైన్ రాష్ట్రంగా చెప్పుకొనే ఫ్లోరిడాలో ఉంది.

దాని పేరు మార్‌-ఎ-లాగో. ఇప్పుడీ ఎస్టేట్ లో అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ‌) తనిఖీలు చేపట్టింది. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో కొన్ని రహస్య పత్రాలను వైట్ హౌస్ నుంచి ఇక్కడకు తరలించారనే ఆరోపణలతో ఈ చర్యకు దిగింది. సోదాల విషయాన్ని ఎఫ్ బీఐ దీనిని ధ్రువీకరించకున్నా.. ట్రంప్ కుటుంబ సభ్యులు అంగీకరించారు.

అసలేం జరిగింది..వైట్ హౌస్ ఖాళీ సమయంలో ట్రంప్ కీలక పత్రాలు ఎత్తుకెళ్లారనేది అభియోగం. గతంలో ట్రంప్‌ ఇంటి నుంచి 15 పెట్టెల్లో పత్రాలు దొరికినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ.. తాము హడావుడిగా ఖాళీ చేశామని.. అప్పుడు ఆరు గంటల సమయం మాత్రమే ఉందని ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ తెలిపారు. ఆ సమయంలో ట్రంప్‌ వద్ద ఉన్న క్లిప్పింగ్‌లను భద్రపర్చారని.. అవే ఆ పెట్టెలని పేర్కొన్నారు.

ట్రంప్ మాజీ అధ్యక్షుడు కావడంతో ఆయన నివాసాలు (ప్రస్తుతం సోదాలు జరిగిన ఎస్టేట్ కూడా) అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాపలాగా ఉంటారు. అయితే, తనిఖీలకు కొద్ది సేపటి ముందు సోమవారం ఎఫ్‌బీఐ సిబ్బంది.. సీక్రెట్‌ సర్వీస్‌ అధికారుల అనుమతి పొందారు.  '30 మంది సిబ్బంది వచ్చారు. వీరు వాషింగ్టన్ ఎఫ్‌బీఐ (శ్వేత సౌధం నుంచి వచ్చారనే భావంలో) వారు. దీని వెనుక ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. నుంచి వారు వచ్చారు. బైడెన్‌కు ముప్పుగా భావిస్తున్న ట్రంప్‌పై దాడికి  వచ్చారు" అని ఎరిక్ పేర్కొన్నారు. అయితే, తన తండ్రి చాలా రోజుల నుంచి దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

మా ఇంటిని ఆక్రమించారంటూ ట్రంప్ ఆక్రోశం అసలే ఆవేశపరుడైన ట్రంప్.. ఎఫ్ బీఐ తనిఖీలపై తీవ్రంగా స్పందించారు.  తన ఇంటిని  ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించారంటూ ధ్వజమెత్తారు. అంతేకాదు.. ఇది దేశానికి చీకటి రోజంటూ పేర్కొన్నారు. మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌ను ట్రంప్‌ 1985లో 10 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. 2018 నాటికి దీని విలువ 180 మిలియన్‌ డాలర్లయింది. ట్రంప్ శీతాకాలంలో ఇక్కడ గడుపుతుంటారు. గోల్ఫ్‌క్లబ్‌లో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. 20 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్‌లో ట్రంప్‌ కుటుంబం కోసం ప్రైవేటుగా కొన్ని భవనాలను కేటాయించారు. కాగా, ట్రంప్‌ 2024లో మూడోసారి అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. దాడుల సమయంలో ట్రంప్‌ న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్స్‌లో ఉన్నారు.
Tags:    

Similar News