డైలాగ్ రైటర్ రూటు మార్చాడు

Update: 2018-05-01 04:30 GMT
టాలీవుడ్ లో హీరోలకు కొరత లేకపోయినా హీరోల రేంజికి తగిన విలన్ల కొతర మాత్రం బాగానే ఉంది. అందుకోసమే అవసరమైతే బాలీవుడ్ నుంచి కూడా విలన్లను ఏరికోరి తెచ్చుకుంటున్నారు. డైరెక్టర్ సాయి కిరణ్ మాత్రం తన సినిమాలో కీలకమైన విలన్ రోల్ కోసం నటుడిని ఇండస్ట్రీలోనే వెతుక్కున్నాడు. మాటల రచయిత అబ్బూరి రవిని తన నెక్స్ట్ సినిమాలో విలన్ గా చూపించబోతున్నాడు.

కిక్.. బొమ్మరిల్లు.. క్షణం.. ఎవడు.. ఇలా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు అబ్బూరి రవి ఖాతాలో ఉన్నాయి. కాస్త సీరియస్ లుక్ లో కనిపించే అబ్బూరి రవి విలన్ గా పర్ ఫెక్ట్ గా సూటవుతాడని భావించి సాయికిరణ్ అతడిని ఏరికోరి ఈ రోల్ కు ఒప్పించాడట. ఇంతవరకు తెర వెనుక వినిపించడమే కానీ తెరముందు అబ్బూరి రవి కనిపించలేదు. డైరెక్టర్ సాయికిరణ్ ప్రపోజల్ ను ముందు అబ్బూరి రవి రిజెక్ట్ చేశాడట. కానీ పట్టు వదలని విక్రమార్కుడి స్టయిల్ లో సాయికిరణ్ ప్రయత్నించి ఎట్టకేలకు ఒప్పించగలిగాడు.

యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టేశారు. టాలీవుడ్ లో రైటర్స్ అంతా డైరెక్టర్స్ కావడానికే ఇష్టపడుతున్నారు. ఇలా రైటర్స్ గా పేరు తెచ్చుకున్న వాళ్లలో తనికెళ్ల భరణి.. ఎల్.బి.శ్రీరాం.. పోసాని కృష్ణమురళి యాక్టింగ్ లోనూ బాగా సక్సెసయ్యారు. వీళ్లలో పోసాని.. భరణి ఇద్దరూ విలన్లుగానూ మెప్పించారు. ఇప్పుడు అబ్బూరి రవి ఏ రేంజిలో మెప్పిస్తాడో చూడాలి.
Tags:    

Similar News