మూవీ రివ్యూ: ‘మహానటి’

Update: 2018-05-09 10:02 GMT
చిత్రం : ‘మహానటి’

నటీనటులు: కీర్తి సురేష్ - దుల్కర్ సల్మాన్ - సమంత అక్కినేని - విజయ్ దేవరకొండ - రాజేంద్రప్రసాద్ - షాలిని పాండే - మాళవిక నాయర్ - తనికెళ్ల భరణి - భానుప్రియ - దివ్యవాణి - తులసి తదితరులు
అతిథి పాత్రలు: మోహన్ బాబు - ప్రకాష్ రాజ్ - నాగచైతన్య - క్రిష్ - అవసరాల శ్రీనివాస్ - తరుణ్ భాస్కర్ - నరేష్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: డాని సాంచెజ్ - లోపెజ్
మాటలు: బుర్రా సాయిమాధవ్
నిర్మాతలు: అశ్వినీదత్ - స్వప్న దత్ - ప్రియాంక దత్
రచన - దర్శకత్వం: నాగ్ అశ్విన్

మహానటి సావిత్రి జీవిత కథతో సినిమా అన్నప్పట్నుంచి ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ఈ చిత్ర ప్రోమోలన్నీ కూడా క్యూరియాసిటీ పెంచాయి. తొలి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’తోనే తనదైన ముద్ర వేసిన నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్.. స్వప్న సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

సావిత్రి ఒక నటిగా మాత్రమే తెలిసిన జర్నలిస్ట్ మధురవాణి (సమంత).. అనారోగ్యంతో కోమాలోకి చేరిన ఆమె గురించి వ్యక్తిగతంగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సావిత్రి జీవితం గురించి కూడా ఎన్నో కొత్త సంగతులు తెలుస్తాయి. మరి సావిత్రి బాల్యం నుంచి ఆమె కోమాలోకి వెళ్లే వరకు ఏం జరిగింది.. వాటి గురించి తెలుసుకుని ఆమె గురించి మధురవాణి జనాలకు ఎలా తెలియజెప్పింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

అందరికీ తెలిసిన కథను ఆసక్తికరంగా చెప్పడం చాలా పెద్ద సవాలే. మనకు తెలిసిన కథేగా.. కొత్తగా ఏం చూపిస్తారు అనే ఒక తక్కువ భావం కూడా ప్రేక్షకుల్లో ఉంటుంది. సావిత్రి జీవితం విషయానికి వస్తే ఆమె చిన్న వయసులోనే నటిగా గొప్ప పేరు సంపాదించడం అందరికీ తెలిసిందే. ఆమె జెమిని గణేశ్ ను రహస్యంగా పెళ్లి చేసుకోవడం.. తర్వాత ఆ విషయం బయటపడటం..  నటిగా అత్యున్నత దశను అనుభవించాక ఆమె వ్యక్తిగతంగా.. ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొని చరమాంకంలో హీన దశను అనుభవించడమూ తెలిసిన విషయాలే. సావిత్రి ఎరా గురించి తెలియని వాళ్లు కూడా.. ఇప్పుడోసారి గూగుల్లో తన పేరు కొడితే ఈ విషయాలన్నీ తెలిసిపోతాయి. యూట్యూబ్ లోకి వెళ్తే ఆమె నటన కౌశలం ఎలాంటిదో అవగతమవుతుంది. ఇన్ని విషయాలు జనాలకు తెలిశాక కూడా ఎక్కడా ఆసక్తి తగ్గకుండా ఆమె కథను చెప్పగలగడం.. డ్రామా పండించడం.. ప్రేక్షకుల్లో భావోద్వేగాలు రేకెత్తించడం.. వాళ్లతో కన్నీళ్లు కూడా పెట్టించగలగడం ‘మహానటి’ టీం సాధించిన గొప్ప విజయం. సావిత్రి గురించి తెలిసిన వాళ్లు.. తెలియని వాళ్లు అందరినీ కదిలించే చిత్రం ఇదనడంలో సందేహం లేదు.

సావిత్రి జీవితంలోని అప్స్  అండ్ డౌన్స్ అన్నింటినీ చాలా హృద్యంగా చూపించిన సినిమా ‘మహానటి’. ఒక బయోపిక్.. ముఖ్యంగా ఒక సినీ ఆర్టిస్టు బయోపిక్ ఎలా తీయాలనే విషయంలో కూడా ఇదొక నమూనాగా నిలుస్తుంది. తొలి ప్రయత్నంలోనే ‘ఎవడే సుబ్రమణ్యం’ హానెస్ట్ మూవీ తీసి ప్రత్యేకతను చాటుకున్న నాగ్ అశ్విన్.. ఈసారి మరింత ఉన్నతమైన.. నిజాయితీతో కూడిన సినిమా తీశాడు. సావిత్రి జీవితాన్ని ఎంత బాగా.. ఎంత గొప్పగా చూపించాలని ఆమె అభిమానులు ఆశిస్తారో  అంతే బాగా.. అంతే గొప్పగా తీసింది అశ్విన్ బృందం. ఐతే కేవలం ఆమె గొప్పదనాన్ని చూపించే... ఆమెను కీర్తించే సీన్లతోనే ఫ్లాట్ గా సినిమాను నడిపించలేదు. అతిశయోక్తులు చూపించలేదు. చాలా సహజంగానే ఆమె జీవితాన్ని చూపించారు. ఆమె జీవితంలోని మలుపుల్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. డ్రామాను చక్కగా పండించారు. ఈ డ్రామానే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

ఆంధ్రా ప్రాంతంలోని ఒక పల్లెటూరికి చెందిన మామూలు అమ్మాయి.. మద్రాస్ వెళ్లి అక్కడ సినిమాల్లో ఎలా అవకాశాలు అందుకుంది.. అక్కడ ప్రఖ్యాత నటిగా ఎలా ఎదిగింది.. దిగ్గజ నటీనటుల్ని.. దర్శక నిర్మాతల్ని ఎలా కట్టిపడేసింది.. అనే విషయాన్ని తెరమీద చూపించిన విధానం ఆసక్తి రేకెత్తిస్తుంది. అప్పటి ప్రఖ్యాత స్టూడియోల్లో సినీ వాతావరణాన్ని తెరమీద ప్రతిబింబిస్తూ వివిధ సన్నివేశాల్ని రక్తి కట్టించిన తీరు కట్టి పడేస్తుంది. సావిత్రి నటిగా రుజువు చేసుకుని.. తన ప్రత్యేకతను చాటుకునే సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించాడు నాగ్ అశ్విన్. ఏఎన్నార్.. ఎస్వీఆర్.. కేవీ రెడ్డి.. చక్రపాణి.. ఎల్వీ ప్రసాద్.. వేదాంతం రాఘవయ్య లాంటి దిగ్గజాల పాత్రల్లో ఇప్పటి నటుల్ని చూపించడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుంది. దీంతో పాటు ఆయా పాత్రలతో ముడిపడ్డ సన్నివేశాల్ని కూడా ఆసక్తి రేకెత్తించేలా తీశారు. ఇవన్నీ ఒకెత్తయితే సావిత్రి-జెమెని గణేశన్ ల ప్రేమకథను.. అందులోని డ్రామాను పండించిన తీరు మరో ఎత్తు. సావిత్రి అప్పటికి నటిస్తున్న సినిమాలతో ఆమె జీవితాన్ని ముడిపెట్టి సన్నివేశాల్ని రక్తి కట్టించిన విధానం దర్శకుడిగా నాగ్ అశ్విన్ పరిణతిని చూపిస్తుంది. ఇక్కడే అతడి స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్ ఏంటో అర్థమవుతుంది. ప్రథమార్ధంలో ఎక్కడా కూడా ఫ్లో దెబ్బ తినకుండా.. ఆసక్తి సన్నగిల్లకుండా చూసుకోవడంలో అశ్విన్ విజయవంతమయ్యాడు. కథ రీత్యా కూడా వినోదానికి.. మలుపులకు ప్రథమార్ధం మంచి అవకాశమే ఇవ్వడంతో సమయం వేగంగా సాగుతుంది.

ఐతే ద్వితీయార్ధం మాత్రం నెమ్మదిస్తుంది. కొన్ని చోట్ల చాలా భారంగా కూడా సాగుతుంది. ఇందుకు సావిత్రి జీవితంలో ఉన్న మలుపులే కారణం. ఆమె వ్యక్తిగత జీవితంలోని ఒడుదొడుకులన్నింటినీ ద్వితీయార్ధంలోనే చూపిస్తారు. భర్తతో విభేదాలు.. సినీ కెరీర్ పతనం.. ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ చూపిస్తూ పాథటిగ్గా సినిమా సాగడంతో సమయం గడవడం కష్టమే అవుతుంది. కథానసారం వచ్చే ఈ కష్టాల్ని భరించక తప్పదు. ద్వితీయార్ధం లెంగ్త్ కూడా ఎక్కువవడం... దీనికి తోడు తెరమీద సావిత్రిని కష్టాలు కమ్మేయడంతో సినిమా ఇంకెప్పుడు ముగుస్తుందనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. మధ్యలో మధురవాణి ట్రాక్ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. కానీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం కట్టి పడేస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. చరమాంకంలో సావిత్రిని చూపించకుండానే ఆమె తాలూకు విషాదాన్ని ప్రేక్షకుడు ఫీలయ్యేలా.. మనసు బరువెక్కేలా చేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ఇక్కడ అతనెంచుకున్న భిన్నమైన దారి మెప్పిస్తుంది. అతడి ప్రత్యేకతను చాటుతుంది. సావిత్రి జీవితాన్ని అవలోకనం చేయించే చివరికి మిగిలేది పాట అద్భుతమనే చెప్పాలి. అలాగే పతాక సన్నివేశం కూడా కదిలిస్తుంది. సమంత పాత్రతో సినిమాకు గొప్ప ముగింపే ఇచ్చారు. సావిత్రి మీదే కాక ఈ సినిమా మీద కూడా ఒక గౌరవభావం కలిగించేలా ముగింపు ఉంటుంది.

నటీనటులు:

సావిత్రి లాంటి ఎవర్ గ్రీన్ నటి పాత్ర చేయడమంటే మాటలు కాదు. ఆ పాత్ర చేసే వ్యక్తిలో జనాలు సావిత్రిని చూసుకోగలిగితే అంత కంటే ఆ నటికి గొప్ప గుర్తింపు మరొకటి ఉండదు. కేవలం పోలికల విషయంలోనే కాక నటన పరంగా కూడా సావిత్రిని తలపించడం ద్వారా కీర్తి పూర్తి మార్కులు కొట్టేసింది. ఏదో సావిత్రిలా మేకప్ వేసుకుని.. ఆమెలా చీరలు కట్టి.. బొట్టు పెట్టేసుకున్నంత మాత్రాన జనాలకు సావిత్రిని చూస్తున్న భావన కలగదు. ఆమెలా నడవాలి.. మాట్లాడాలి.. హావభావాలు పలికించాలి. అభినయించాలి. ఈ విషయంలో కీర్తి మెస్మరైజ్ చేస్తుంది. సావిత్రిని మళ్లీ చూస్తున్న భావనే కలిగించిందామె. సావిత్రి నటించిన సినిమాల్లోని సన్నివేశాల్ని చిత్రీకరించే క్రమంలో కీర్తి ఇచ్చిన హావభావాలకు ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఐతే కీర్తి వాయిస్ మాత్రం సావిత్రి పాత్రకు సూటవ్వలేదనిపిస్తుంది. అదొక్కటే చెప్పుకోదగ్గ మైనస్. ఇక తెరపై సావిత్రిని చూసిన పాత్రల వల్ల కావచ్చు.. ఆమె హుందాతనమే గుర్తుకొస్తుంది. కాకపోతే ఇందులో కీర్తి పాత్ర ద్వారా ఆమెలోని అల్లరి కోణాన్ని కూడా చూపించారు. అది కొంచెం కొత్తగా.. ఇబ్బందిగా కూడా అనిపించొచ్చు.ఇక జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కూడా జీవించేశాడనే చెప్పాలి. రూపం విషయంలో కొంచెం తేడా ఉన్నప్పటికీ ఆ పాత్రను అద్భుతంగా పోషించాడు దుల్కర్. భిన్న కోణాలున్న ఆ పాత్రను పండించాడు. అతడిలోనూ ఒక నిజాయితీతో కూడిన అభినయం కనిపిస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది రాజేంద్ర ప్రసాద్ నటన గురించి. సావిత్రి పెదనాన్న పాత్రలో ఆయన కూడా గొప్పగా నటించారు. వర్తమానంలో వచ్చే మధురవాణి పాత్రలో సమంత కూడా కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ సీన్లో సమంత అభినయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన సొంత వాయిస్ తో చాలా సహజంగా డైలాగులు చెబుతూ కన్నీళ్లు పెట్టించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. విజయ్ దేవరకొండ బాగానే చేశాడు కానీ.. అతడి వాయిస్ ఆ పాత్రకు సెట్టవ్వలేదు. మాళవిక నాయర్.. భానుప్రియ.. దివ్యవాణి.. మహేష్.. షాలిని పాండే.. తనికెళ్ల భరణి లాంటి వాళ్లు చిన్న చిన్న పాత్రల్లోనే మెప్పించారు. సావిత్రి సినీ కెరీర్ ను చూపించే క్రమంలో ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు.. చక్రపాణిగా ప్రకాష్ రాజ్.. కేవీ రెడ్డిగా క్రిష్.. ఏఎన్నార్ గా నాగచైతన్య.. ఎల్వీ ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్ ఆకట్టుకుంటారు.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గా ‘మహానటి’ అత్యున్నత స్థాయిలో నిలుస్తుంది. మిక్కీ జే మేయర్ తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. ఇటు పాటలు.. అటు నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి. ప్రతి పాటా సినిమాలో చక్కగా ఇమిడిపోయింది. ముఖ్యంగా చివరికి మిగిలేది అంటూ చివర్లో వచ్చే పాట ప్రత్యేకంగా నిలిచిపోయేదే. ఆద్యంతం సినిమాను ఒక ఫీల్ తో నడిపించడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. డాని ఛాయాగ్రహణం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సినిమాలతో ముడిపడ్డ సన్నివేశాల్లో ఛాయాగ్రాహకుడి కష్టం.. ప్రత్యేకత కనిపిస్తాయి. సావిత్రి కథ మొత్తాన్ని చాలా బాగా చూపించారు. ఐతే వర్తమానంలో నడిచే సమంత ట్రాక్ ను అంత బాగా చిత్రీకరించలేదనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్షన్ సినిమాకు మరో పెద్ద ఎసెట్. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించడంలో కళా దర్శకుడి కృషి అడుగడుగునా కనిపిస్తుంది. ఈ విషయంలో నిర్మాతల్ని కూడా ఎంత పొగిడినా తక్కువే. ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు ఏం అవసరమో అవన్నీ అందించి.. దీన్నొక క్లాసిక్ గా మలచడానికి అన్ని ప్రయత్నాలూ చేశాయి వైజయంతీ మూవీస్.. స్వప్న మూవీస్ సంస్థలు. వీటి ప్రస్థానంలో ఈ చిత్రం ఒక మైలురాయిలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. సాయిమాధవ్ బుర్రా మాటలు కూడా చక్కగా కుదిరాయి. ఎలాంటి సినిమాలకైనా మాటలు రాయగలనని ఆయన మరోసారి చాటుకున్నారు. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ లో సమంత పాత్రతో ముడిపడ్డ డైలాగుల్లో ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సావిత్రి సినిమా అంటూ ఒక కల కని.. దాన్ని
అద్భుతంగా తెరమీదికి తెచ్చిన అతడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అందరికీ తెలిసిన కథను ఎంతో ఆసక్తికరంగా.. హృద్యంగా తెరమీదికి తెచ్చాడతను. స్క్రీన్ ప్లే విషయంలో చేసిన కసరత్తు అమోఘం. కేవలం ఒక్క సినిమా అనుభవంతో అతను ఇలాంటి చిత్రం తీయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కథ రీత్యా అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ.. ఈ కథను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడిగా నాగ్ అశ్విన్ విజయవంతమయ్యాడు.

చివరగా: మహానటి.. సావిత్రికి మహా నివాళి

రేటింగ్- 3.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News