SSMB 29 : ఆఫ్రికా కంటే ముందు ఒడిశాకి..!

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్‌ అడ్వంచర్‌ మూవీ షూటింగ్‌ చకచక జరుగుతోంది.;

Update: 2025-03-05 10:20 GMT

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్‌ అడ్వంచర్‌ మూవీ షూటింగ్‌ చకచక జరుగుతోంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించిన రాజమౌళి తదుపరి షెడ్యూల్‌ను ఆఫ్రికాలో నిర్వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాకు సంబంధించిన కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను, ఛేజింగ్‌ సన్నివేశాలను ఆఫ్రికాలోని ముఖ్య అడవుల్లో చిత్రీకరించేందుకు గాను రాజమౌళి అండ్‌ టీం అక్కడకు వెళ్లబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆఫ్రికా వెళ్లడానికి ముందు రాజమౌళి మీడియా ముందుకు వచ్చి సినిమాకు సంబంధించిన విషయాలను వెళ్లడించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.

హైదరాబాద్‌ అల్లూమినియం ఫ్యాక్టరీలోని షెడ్యూల్‌ పూర్తి కావడంతో తదుపరి షెడ్యూల్‌ కోసం రెడీ అవుతున్న మేకర్స్ నుంచి ఆసక్తికర సమాచారం అందుతోంది. ముందుగా ఆఫ్రికాకి కాకుండా ఒడిశాలోని అటవి ప్రాంతంలో షూటింగ్‌ను జరపనున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలోని కోరాపుట్‌ ప్రాంతంలో షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ కోరాపుట్‌ ప్రాంతానికి చేరుకున్నారట. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయాన్ని ఎలాగూ దృవీకరించదు. అయినప్పటికీ కచ్చితంగా అక్కడే మహేష్ బాబు SSMB 29 సినిమా షూటింగ్‌ జరగబోతుందనే వార్తలు వస్తున్నాయి.

భారీ ఫారెస్ట్‌ యాక్షన్ అడ్వంచర్‌ మూవీగా రూపొందబోతున్న SSMB 29 లో ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఒడిశాలోని కోరాపుట్‌ షెడ్యూల్‌కి ప్రియాంక చోప్రా హాజరు కాదని సమాచారం అందుతోంది. మొదట పృథ్వీరాజ్ సుకుమారన్‌పై ముఖ్య సన్నివేశాలు, షాట్స్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. మహేష్ బాబు రెండో షెడ్యూల్‌కి జాయిన్‌ కావడానికి కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పృథ్వీరాజ్‌, మహేష్ బాబు కాంబో సీన్స్ చిత్రీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్‌ అడ్వంచర్‌ థ్రిల్లర్‌ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌లో కే ఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ కథను అందిస్తూ ఉండగా, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్‌ సినిమాల్లో చూడని థ్రిల్లింగ్‌ విజువల్స్‌ను, యాక్షన్‌ సన్నివేశాలను ఈ సినిమాలో రాజమౌళి చూపించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. రెండు పార్ట్‌లుగా రూపొందబోతున్న ఈ సినిమా కోసం నిర్మాత దాదాపుగా రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నారట. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.2500 కోట్లను కొల్లగొట్టాలని రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. మరి ఆ స్థాయిలో SSMB 29 సినిమా హిట్‌ అయ్యేనా చూడాలి.

Tags:    

Similar News