పవన్ ముందు చిన్నబోయిన ఏపీ బీజేపీ

ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కోలాంటి లక్షణం ఉంటుంది. పార్టీ పేరు చెప్పినంతనే వారు ఎలాంటి వాదాన్ని వినిపిస్తారో తెలియంది కాదు.

Update: 2024-09-22 14:13 GMT

ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కోలాంటి లక్షణం ఉంటుంది. పార్టీ పేరు చెప్పినంతనే వారు ఎలాంటి వాదాన్ని వినిపిస్తారో తెలియంది కాదు. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ బీజేపీ తీరు విమర్శలకు తావిస్తోంది. బీజేపీ అన్నంతనే హిందుత్వ అన్న ముద్ర ఉన్న ఆ పార్టీ.. ఏపీలో అధికార కూటమిలో భాగస్వామి. ఇలాంటి వేళ.. తమ రాజకీయ ప్రత్యర్థులు చేసిన తప్పులను ఎండగట్టటమే కాదు.. దానికి సంబంధించిన చేపట్టాల్సిన కార్యక్రమాలు చాలానే ఉంటాయి. కానీ.. ఆ విషయంలో ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిచ్చేలా మారింది.

శ్రీవారి లడ్డూ కల్తీ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే.. టీడీపీ.. జనసేన దూకుడు ముందు ఏపీ బీజేపీ నేతల వెలవెలపోవటమే కాదు.. వారి వాయిస్ ఎక్కడా కనిపిస్తున్న పరిస్థితి లేదు. నిజానికి కమలనాథులు చేయాల్సిన పనిని జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్నారని చెప్పాలి. లడ్డూ అంశాన్ని తీవ్రంగా తీసుకోవటమే కాదు.. మిగిలిన రాజకీయ పార్టీల తీరుకు భిన్నంగా పవన్ ప్రకటిస్తున్న నిర్ణయాలు మిగిలిన రాజకీయ పార్టీలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

సాధారణంగా ఒక దుర్మార్గ ఘటన జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించటం.. దాని మీద ఘాటు విమర్శలు చేయటం మామూలే. అందుకు భిన్నంగా లడ్డూ ఎపిసోడ్ లో సగటు హిందువుగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో మరే పార్టీ అధినేత కానీ.. కరుడుకట్టిన హిందుత్వ వాదులు సైతం తీసుకోని నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా పవన్ కొత్త విధానానికి తెర తీశారని చెప్పాలి. అలా అని అన్యమతం మీద ఆయన విరుచుకుపడటం లేదు. ఒక ధర్మానికి జరిగిన నష్టాన్నిమాట్లాడటం.. మిగిలిన ధర్మాల పట్ల మర్యాద.. గౌరవాల్ని ప్రదర్శించటం ద్వారా.. అందరికి ఆమోదయోగ్యమైన విధంగా పవన్ తీరు ఉంటుందని చెబుతున్నారు.

నిజానికి పవన్ చేయాల్సిన దీక్షను.. ఏపీ బీజేపీకి చెందిన అగ్రనేతలు కలిసికట్టుగా చేయటం.. దాన్నో ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవటంలో వెనుకపడ్డారని చెప్పాలి. నిజానికి దేశ రాజకీయాల్లో సాఫ్ట్ హిందుత్వ పార్టీల లేమి ఎప్పటి నుంచో వెంటాడుతోంది. ఆ కొరతను తీర్చిన మొదటి పార్టీగా జనసేనను చెప్పాలి. నిజానికి ఈ అవకాశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అందిపుచ్చుకుంటుందని.. అదే జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా నిలుస్తుందని పలువురు భావించేవారు. కానీ.. కేజ్రీవాల్ ఆ దిశగా అడుగులు వేయలేదు.

ఈ విషయంలో జనసేనాని కొత్త పంథాను ఎంచుకున్నారని చెప్పాలి. సాఫ్ట్ హిందుత్వలో.. హిందువుల పక్షపాతిగా.. వారికి అండగా ఉండటం.. వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లే అంశాల పట్ల ఓపెన్ మాట్లాడటం.. సెక్యులర్ శక్తులుగా చెప్పుకునే పక్షాలకు భయపడకుండా ధీటుగా వాదనల్ని వినిపించటమే కాదు.. అన్య మతాల పట్ల కించిత్ తగ్గని గౌరవాభిమానాల్ని ప్రదర్శించటం ఉంటుంది. ఈ తరహా బ్లెండ్ ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీకి లేదనే చెప్పాలి. పవన్ తీరు ఇందుకు తగ్గట్లే ఉంది. తాజాగా ఆయన చేపట్టిన దీక్షతో అది ఝూడీ అయ్యిందని చెప్పాలి. ఏమైనా.. శ్రీవారి లడ్డూ కల్తీ వేళలో.. ఏపీలో మరింత హోల్డ్ పెంచుకోవాల్సిన బీజేపీ.. తమకంత సీన్ లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.

Tags:    

Similar News