ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఏపీ స‌ర్కార్‌... కీల‌క నిర్ణ‌యం

ఈ నేప‌థ్యంలో జూలై 1వ తేదీ నుంచి 1-2 తారీకుల్లోనే ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు నిర్ణ‌యించింది

Update: 2024-06-28 00:30 GMT

ఏపీలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ స‌ర్కారుగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని వ‌చ్చే ఐదేళ్ల పాటు వ‌డివ‌డిగా అడుగులు వేయించాలని భావిస్తున్న ముఖ్య‌మంత్రి.. ఈ క్ర‌మంలో ఉద్యోగుల పాత్ర‌ను త‌న‌దైన శైలిలో వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగా వారికి పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపైనా చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. ముఖ్యంగా ప్ర‌తి నెలా 1వ తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త జ‌గ‌న్ స‌ర్కారు.. వేత‌నాలు ఎప్పుడు ఇస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో జూలై 1వ తేదీ నుంచి 1-2 తారీకుల్లోనే ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు నిర్ణ‌యించింది. ఇది.. ఉద్యోగులకు సంతోషాన్ని క‌లిగిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు మ‌రో గుడ్ న్యూస్ కూడా.. ఉద్యోగుల‌కు అందించారు చంద్ర‌బాబు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారానికి ఐదు రోజుల ప‌ని విధానాన్ని పొడిగించింది. ఈ నెల 27తో ఐదు రోజుల పని విధానం ముగిసింది. ఈ నేప‌థ్యంలో వారికి ఈ అవ‌కాశాన్ని కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది.

Read more!

ఉద్యోగుల సంఘం విజ్ఞ‌ప్తి మేర‌కు సీఎం చంద్ర‌బాబు వారికి ఈ అవ‌కాశం క‌ల్పించారు. అయితే..ప‌నిచేసే రోజుల్లో మాత్రం నిక్క‌చ్చిగా ప‌నిచేయాల‌ని ఆయ‌న కోరారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వ‌చ్చి పోయేందుకు వీలుగా.. ఉద్యోగుల‌కు వారానికి 5 రోజుల ప‌నివిధానాన్ని చంద్ర‌బాబు స‌ర్కారే ప్ర‌వేశ పెట్టింది. త‌ర్వాత‌.. వ‌చ్చిన జ‌గ‌న్ కూడా.. దీనిని కొన‌సాగించారు. ఇప్పుడు మ‌రోసారిదీనిని కొన‌సాగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

అమ‌రావ‌తికి బ‌ల‌మైన అధికారి!

రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని భావిస్తున్న సీఎం చంద్ర‌బాబు ఆదిశ‌గా.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్, ఎండీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీ పార్థసారథిని ఆయ‌న‌ నియమించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇదే పదవిలో కొనసాగిన లక్ష్మీ పార్థసారథి రాజ‌ధానికి విలువైన సేవ‌లు అందించారు. వైసిపి ప్రభుత్వంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలను నిలిపి వేశారు. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి రాజ‌ధాని ప‌నులు ప‌ట్టాలెక్క‌నున్న నేప‌థ్యంలో పార్థ‌సార‌థికి ప‌గ్గాలు అప్ప‌గించారు.

Tags:    

Similar News