ఒకప్పుడు వారిద్దరు సినిమా చేశారు.. ఈసారి ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నిక

ఇంతకూ ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కంగనా రౌనత్.. మరొకరు లోక్ జన శక్తి పార్టీ చీఫ్ చిరాగా పాశ్వాన్.

Update: 2024-06-07 05:08 GMT

మూడు రోజుల క్రితం వెల్లడైన లోక్ సభా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆసక్తికర అంశాలకు కొదవ లేదు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఒక ఆసక్తికర అంశం వెలుగు చూసింది. గతంలో ఒక సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఇద్దరు.. తాజా ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నిక కావటం.. వారిద్దరు లోక్ సభలో అడుగు పెట్టనున్నారు. ఇంతకూ ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కంగనా రౌనత్.. మరొకరు లోక్ జన శక్తి పార్టీ చీఫ్ చిరాగా పాశ్వాన్. పదమూడేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని తాజాగా గుర్తు చేసుకుంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రానట్లే.. ఇప్పటివరకు ఏ సభలో చూడని కొన్ని ఆసక్తికర అంశాలు చోటు చేసుకోనున్నాయి. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే వేళలో కొలువు తీరే లోక్ సభలో.. బాలీవుడ్ అగ్రనటి కంగనా రౌనత్ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. పదమూడేళ్ల క్రితం తాను నటించిన హీరో కూడా తాజా ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఈసారి లోక్ సభలో అడుగు పెట్టనున్నారు.

దివంగత సీనియర్ నేత రాం విలాస్ పాశ్వాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లోక్ జన శక్తి పార్టీ అధినేతగా వ్యవహరించిన ఆయన.. కొంతకాలం క్రితం మరణించటం తెలిసిందే. అనంతరం ఆ పార్టీ పగ్గాలు తీసుకున్న ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తాజా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. చిరాగ్ పదమూడేళ్ల క్రితం బాలీవుడ్ మూవీలో నటించారు.

2011లో ‘మిలే నా మిలే హమ్’ అన్న మూవీలో నటించారు. ఈ మూవీలో హీరోయిన్ గా కంగనా నటించారు. యాక్టింగ్మీద ఆసక్తి ఉన్నప్పటికీ చిరాగ్ నటించిన మూవీ ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోవటంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. రాజకీయాల మీద ఫోకస్ పెంచారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న ఆయన.. పార్టీని నడిపిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఐదు చోట్ల తన అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా చిరాగ్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అందులో చిరాగ్ ఒకరిని ప్రశ్నిస్తూ.. ‘మీకుకంగనా నచ్చదా? ఆమె సినిమా కెరీర్ నచ్చదా?’’ అంటూ ప్రశ్నించటం కనిపిస్తుంది. అంతేకాదు.. కంగనా గురించి చిరాగ్ మాట్లాడుతూ.. తామిద్దరం కలిసి నటించటం ప్రేక్షకులకు నచ్చలేదని.. కానీ ఇప్పుడు ఇద్దరం పార్లమెంట్ కు వెళ్లనున్నామని పేర్కొన్నారు. మొత్తంగా పార్లమెంట్ లో వీరిద్దరి కాంబినేషన్ కాసింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News