మణిపూర్ లో రాష్ట్రపతి పాలన... కారణం సీఎం పోస్ట్!
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర హోంశాఖ జారీ చేసింది.
దేశంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... జాతుల మధ్య ఘర్షణలతో గత కొన్ని రోజులుగా అట్టుడుకుపోతున్న మణిపూర్ లో కేంద్రం "రాష్ట్రపతి పాలన" విధించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర హోంశాఖ జారీ చేసింది.
అవును... మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదేశాల్లో పేర్కొన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా... మణిపూర్ గవర్నర్ సమర్పించిన నివేదికతో పాటు ఇతర నివేదికల సమాచారాన్ని పరిశీలించిన అనంతరం.. అక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించే పరిస్థితి లేదనే అంచనాకు వచ్చామని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అధికారాలు ఉపయోగించి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే... శాసనసభ సమావేశాలకు ముందే సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ వెంటనే సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ అజయ్ కుమార్ ఆదేశాలిచ్చారు. తర్వాత.. తదుపరి సీఎంపై రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. అయితే.. ఈ విషయంలో ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపే కేంద్రం మొగ్గుచూపింది.
1951 నుంచి 11వ సారి!:
రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయలేదని.. సస్పెండ్ చేశామని బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సంబిత్ పాత్రా స్పష్టం చేయడంతో ఈశాన్య రాష్ట్రంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 విధించడం జరిగింది. ఇలా ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించడం 11వ సారి కావడం గమనార్హం.
ఈ రాష్ట్రంలో చివరిసారిగా 2001 జూన్ 2 న రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. అది 2022 మార్చి 6న ముగిసింది. ఇలా 277 రోజుల పాటు మణిపూర్ లో చివరిగా రాష్ట్రపతి పాలన కొనసాగింది.