ఖరీదైన లాయర్...ఖర్చు ఎవరిది ?

సిద్ధాద్ర లూద్రా. ఈ పేరు లీగల్ ఎక్స్ పర్టులలో లీగల్ ఫీల్డ్ లో మారు మోగేదే.

Update: 2024-10-01 03:51 GMT

సిద్ధాద్ర లూద్రా. ఈ పేరు లీగల్ ఎక్స్ పర్టులలో లీగల్ ఫీల్డ్ లో మారు మోగేదే. ఆయన విమానాల్లో వచ్చి కేసులు వాదిస్తారు. ఆయన ఫీజు గంటకు లక్షల్లో ఉంటుంది అని ప్రచారంలో ఉంది. ఇంతకీ ఈ లూద్రా అన్న ఆయన ఏపీ ప్రజలకు బాగా పరిచయస్థులే.

అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. గత ఏడాది చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉంటే ఆయన తరఫున హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వాదించిన వారుగా లూద్రా అందరి మదిలో ఉంటారు. అప్పట్లోనే ఆయన తీసుకునే ఫీజు కూడా చర్చకు వచ్చింది.

ఆయనకు అంత ఫీజు ఇచ్చి రప్పిస్తున్నారుట అని కూడా అంతా వింతగా విడ్డూరంగా చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ తరఫున ఆయన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో సుప్రీం కోర్టులో వాదించారు. ఈ కేసు అక్టోబర్ 3కి వాయిదా పడింది. దాంతో ఆయన మళ్లీ వాదించనున్నారు. ఈ కేసు విషయంలో ఖరీదైన లాయరే దిగారు అని అంతా అంటున్నారు. అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని ప్రకటించింది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు. దాని మీద గత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అలాగే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో సీబీఐ కానీ లేదా న్యాయ విచారణ కానీ జరిపించాలని వారు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే టీటీడీ తరఫున లూద్రా రావడం పట్ల చర్చ సాగుతోంది. రాజకీయంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాన్ని చేసి ఆ మీదట దాని వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తినే పరిస్థితికి తెచ్చిన వారు ఈ కేసు విషయంలో ఖర్చులు భరించాలని నెటిజన్ల నుంచి డిమాండ్ వస్తోంది.

అంతే తప్ప శ్రీవారికి ప్రేమతో అభిమానంతో భక్తులు హుండీలలో వేసిన కానుకల నుంచి ఖరీదైన లాయర్ కి ఫీజు ఇవ్వాల్సిన అవసరం ఉందా అని అంటున్నారు. ఇదే విషయం మీద సీనియర్ న్యాయవాది విజయ్ బాబు ఒక చానల్ డిబేట్ లో మాట్లాడుతూ ఖరీదైన లాయర్ ని రంగంలోకి దింపారని ఆ ఖర్చులు రాజకీయ నాయకత్వం కానీ ఆయా పార్టీలు కానీ భరించాల్సి ఉంటుంది తప్ప టీటీడీ నుంచి ఖర్చు చేయడం సబబు కాదని అన్నారు.

ఏది ఏమైనా ఖరీదైన లాయర్ గా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన లూద్రా లడ్డూలో కల్తీ ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పలేకపోయారు అని అంటున్నారు. మొత్తం మీద శ్రీవారి లడ్డూలు భక్తుల సెంటిమెంట్. దాని విషయంలో చెలరేగిన వివాదం రాజకీయపరమైతే మాత్రం భక్తుల సొమ్ముగా స్వామికి కైంకర్యంగా వస్తున్న హుండీ ఆదాయం నుంచి ఖర్చు పెట్టడం సమంజసం కాదని నెటిజన్ల నుంచి వస్తోంది.

Tags:    

Similar News