అరకు కాఫీ మరో ఘనత.. రైతులకు టాటా గ్రూప్ భారీ ఆఫర్

మన అరకు కాఫీ మరో ఘనత సాధించింది. ఇప్పటికే ఖండాంతరాలు దాటిన అరకు కాఫీ తొలిసారిగా ఆర్గానిక్ పద్ధతిలో సాగు అవుతోంది.;

Update: 2025-02-28 01:30 GMT

మన అరకు కాఫీ మరో ఘనత సాధించింది. ఇప్పటికే ఖండాంతరాలు దాటిన అరకు కాఫీ తొలిసారిగా ఆర్గానిక్ పద్ధతిలో సాగు అవుతోంది. సాధారణ ఉత్పత్తికన్నా దీని ధర ఎక్కువగా ఉండటం, రుచి కూడా అద్భుతంగా ఉండటంతో రైతులకు మంచి ధర పలుకుతోంది. పూర్తిగా సంప్రదాయ సేద్యంతో సాగుచేస్తున్న ఆర్గానిక్ కాఫీని కొనుగోలు చేసేందుకు ప్రతిష్టాత్మక టాటా గ్రూప్ ముందుకు రావడం విశేషం.

విశాఖ మన్యంలోని అరకు ఆర్గానిక్ కాఫీ అందుబాటులోకి వచ్చింది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ప్రస్తుతం సాగు చేస్తున్న, సేకరించిన కాఫీ గింజలను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. వ్యవసాయ, ఉద్యాన పంటలను ఎప్పటి నుంచో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. కానీ, తొలిసారిగా కాఫీని కూడా సేంద్రియ పద్దతిలో పెంచుతున్నారు. పదేళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన సమగ్ర కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా జీసీసీ ఆర్గానిక్ కాఫీ సాగును ప్రోత్సహించింది. నాలుగేళ్ల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల పరిధిలో 2,600 ఎకరాల కాఫీ తోటల్లో నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ (ఎన్పీఓపీ)కు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో గిరిజనులతో సాగు చేపట్టింది.

వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (అపెడా) ధ్రువీకరించిన ఏజెన్సీలతో వరుసగా మూడేళ్లపాటు ఆ పంటలను తనిఖీ చేయించి ఈ ఏడాదికి ఆర్గానిక్ ధ్రువీకరణ సాధించింది. ఇందుకోసం జీసీసీ రూ.70 లక్షల వరకు ఖర్చు చేసింది. టాటా గ్రూప్ ఇప్పటికే కాఫీ వ్యాపారంలో ఉంది. ఆ సంస్థ త్వరలో ఆర్గానిక్ కాఫీని మార్కెట్ లోకి తేవాలని చూస్తోంది. ఈ క్రమంలో జీసీసీ అధికారులు ఆ గ్రూపును సంప్రదించగా, వారు ఏజెన్సీలో రైతులు పండించిన పంటను పరిశీలించి తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. తొలి విడతగా 10 వేల కిలోల కాఫీ గింజల కొనుగోలుకు జీసీసీతో ఒప్పందం చేసుకున్నారు.

విదేశాల్లో కాఫీ దిగుబడులు తగ్గడంతో దేశీయంగా మన్యం కాఫీ పంటకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొనుగోలు ధరలు పెరిగాయి. వీటికి అదనంగా సేంద్రియ కాఫీకి మరింత రేటు దక్కుతుంది. సాధారణ పార్చిమెంటు కాఫీ కేజీ రూ.400 ధర లభిస్తే ఆర్గానిక్ పార్చిమెంట్ కు రూ.450 చొప్పున చెల్లిస్తున్నారు. చెర్రి కాఫీ కేజీ రూ.250 ధర పలికితే సేంద్రియ విధానంలో పండించిన పంటకు రూ.330 వరకు ఇస్తున్నారు. కేజీకి రూ.50 నుంచి రూ. 80 వరకు తేడా ఉండటంతో మిగతా రైతులు కూడా ఆర్గానిక్ సాగుకే మొగ్గు చూపుతున్నట్లు జీసీసీ ఎండీ కల్పనా కుమారి తెలిపారు.

Tags:    

Similar News