ఉక్రెయిన్ లో మరో శవాల దిబ్బ.. ఈసారి ఖార్కీవ్ లో

Update: 2022-09-16 09:30 GMT
బుచా.. మారియుపోల్.. ఇప్పుడు ఖార్కీవ్.. ఉక్రెయిన్ లో శవాల గుట్టలు బయటపడుతూనే ఉన్నాయి. సైనిక చర్య పేరిట ఎంతమందిని రష్యా పొట్టన పెట్టుకుందో..? లేక తన సైనికులు  చనిపోతే ఖననం చేసిందో.. కానీ మరో భారీ శవాల గుట్ట బయటపడింది. ఉక్రెయిన్ లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కీవ్ సమీపంలో ఉండే ఇజియంలో వందల శవాలు గుట్టలుగా ఓ గొయ్యిలో పడి ఉండడాన్ని గుర్తించారు. రష్యా దళాలను వెళ్లగొట్టి ఈ నగరాన్ని ఇటీవల ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురువారం ఖార్కీవ్ లో పర్యటించారు. మరోవైపు తాజాగా అధికారులు ఖార్కీవ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు .వారికి ఒళ్లు జలదరించే దృశ్యాలు కనిపించాయి. ఈ నగరంలోని ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బలు రష్యా దురాగతాన్ని చాటాయి.

రష్యా సరిహద్దు నగరం ఖార్కీవ్.. ఉక్రెయిన్ రాజధానికి కీవ్ కు ఉత్తరాన రష్యా సరిహద్దులో ఉంటుంది. రెండింటి మధ్య దూరం దాదాపు 500 కి.మీ. ఖార్కీవ్ పూర్తిగా రష్యా సరిహద్దులోనే ఉంటుంది. దీనిని
యుద్ధం మొదట్లోనే రష్యా చెరబట్టింది. అయితే, ఇటీవల ఉక్రెయిన్ తిరిగి సొంతం చేసుకుంది. ఖార్కీవ్ కు 100 కి.మీ. దూరంలోనే ఇజియం ఉంటుంది. గత శనివారం ఇజియం కూడా ఉక్రెయిన్ చేతుల్లోకి వచ్చింది. దీనిని యుద్ధంలో రష్యాకు పెద్ద దెబ్బగా చెబుతున్నారు. ఎందుకంటే.. ఖార్కీవ్-డొనెట్క్స్ రీజియన్ల మధ్యన కీలక ప్రాంతంలో ఇజియం ఉంటుంది. దీని శివారు అటవీ ప్రాంతంలోని ఓ గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు ఉన్నట్లు తూర్పు ఖర్కివ్‌ సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఎలా చంపారంటే.. కీవ్ సమీపంలోని బుచాలో హత్యాచారాలకు పాల్పడిన రష్యా సైన్యం.. మారియుపోల్ లో రాకెట్ దాడులతో ప్రజల ప్రాణాలను బలిగొంది. ఇక ఇజియంలో వెలుగుచూసిన శవాల్లో కొందరిని
తుపాకులతో కాల్చి చంపినట్లు తెలుస్తోంది.

మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా చనిపోయారని తేటతెల్లం అవుతోంది. అయితే, చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఎప్పటిలాగే కొన్ని మృతదేహాలపై తీవ్రంగా హింసించినట్లు స్పష్టమవుతోంది. ఇదే ప్రాంతంలో ఒకచోట 17 మంది ఉక్రెయిన్‌ సైనికుల మృతదేహాలు ఉన్నట్లు ఓఅంతర్జాతీయ వార్తా వెల్లడించింది. వీరిని పూడ్చివేసిన ప్రాంతం చుట్టూ వందలాది చిన్నచిన్న సమాధులు కూడా ఉన్నాయి.

రష్యా క్రిమియా, డాన్ బాస్ నూ కోల్పోక తప్పదు ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి వైదొలగడం అంటే రష్యాకు పెద్ద దెబ్బే. అమెరికా అందించిన హిమార్స్ క్షిపణులతో ఉక్రెయిన్ పోరాటం దిగ్విజయంగా సాగిస్తోంది.

దీంతో రష్యా దళాలు ఆయుధాలను వదిలేసి మరీ పారిపోతున్నాయి. ఇక రష్యా వైపు నుంచి చూస్తే.. క్రిమియా ద్వీపాన్ని ఉక్రెయిన్ నుంచి 2014లో ఆక్రమించింది. ఇప్పుడు అక్కడ రష్యాదే రాజ్యం. తాజా యుద్ధంలో క్రిమియా నుంచి డాన్ బాస్ (లుహాన్స్క్, డొనెట్క్స్)ను ఆపై ఖార్కీవ్ వయా ఇజియం కలుపుకోవాలని ఆలోచన. ఇవన్నీ ఉక్రెయిన్ ఎదురుదాడితో తలకిందులయ్యాయి.
అంతేకాదు.. క్రిమియానూ కోల్పోయే పరిస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News