గాంధీ.. తిలక్ కంటే గొప్పోళ్లా మీరు.. జవహర్ రెడ్డిపై ఏపీ హైకోర్టు ఫైర్

Update: 2022-07-29 04:30 GMT
ఏం చేయాలి? ఏం చేయకూడదు?.. అందునా కోర్టు వివాదాలకు సంబంధించి తామెలా వ్యవహరించాలన్న దానిపై దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయినా ఐఏఎస్ లకు తెలియంది కాదు.కానీ.. వారు వ్యవహరించే తీరు కారణంగా లేనిపోని సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఇబ్బందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె. జవహర్ రెడ్డి ఎదుర్కొన్నారు. ఏపీ హైకోర్టు విచారణకు హాజరు కావాల్సిన ఆయన గైర్హాజరు అయిన నేపథ్యంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

జవహర్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీటింగ్ ఉందన్న పేరుతో గైర్హాజరు అవుతారా? కోర్టు ముందు హాజరయ్యే సమయం లేదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు ఉంటాయా? సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రోజుకుఎన్ని గంటలు మీటింగ్ లలో పాల్గొంటారో ముఖ్యమంత్రి పేషీ నుంచి వివరాలు తెప్పించి వాస్తవాలు తేల్చమంటారా? మహాత్మాగాంధీ.. బాలగంగాధర్ తిలక్ లాంటి మహోన్నత వ్యక్తులూ కోర్టులు ఇచ్చిన ఆదేశాల్ని గౌరవించి హాజరయ్యారని.. వారి కంటేమీరు గొప్ప వారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించి.. ఘాటు వ్యాఖ్యలు చేసింది.

దీనంతటికి కారణం ఒక కేసు విచారణగా చెప్పాలి. 2005 మే నుంచి 2019 జులై వరకు తన వేతన బకాయిలు రూ.10.59 లక్షలకు వడ్డీని కలిపి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ హైకోర్టును క్రిష్ణమూర్తి అనే ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన బకాయిల్ని చెల్లించాలని కోర్టు గత నవంబరులో ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సదరు ఉత్తర్వు అమలు కాలేదు. దీంతో కోర్టు ధిక్కార కేసును దాఖలు చేశారు.

దీనికి సంబందించి అప్పటి అధికారులుగా ఉన్న పలువురితో పాటు ఇప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జవహర్ రెడ్డి కూడా ఒకరు. అప్పట్లో ఆయన జలవనరుల శాఖలో పని చేసేవారు. మిగిలిన అధికారులంతా కోర్టు ఎదుట హాజరు కాగా..జవహర్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు.

తనకు మీటింగ్ ఉందని తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సదరు పిటిషన్ లో జవహర్ రెడ్డి పేర్కొన్న మీటింగ్ ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుందన్న వివరాలు లేకపోవటాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

పిటిషన్ కు సంబంధించి వందల రూపాయిల ఇష్యూ కాదని.. దగ్గర దగ్గర రూ.12లక్షలకు సంబంధించిందని.. ఇలాంటి విషయాల్లో కోర్టు  ఆదేశాలు అమలు కాకపోవటం ఏమిటని హైకోర్టు మండిపడింది. అధికారుల్ని అరెస్టు చేయాలని వారెంట్ ఇష్యూ చేస్తేనే.. విచారణకు హాజరు కావాలనో ఆదేశిస్తేనే కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నారని.. లేనిపక్షంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును హాజరు కాకుండా మినహాయింపు కోరే వేళలో.. అందులో ఉండాల్సిన అంశాలు ఏమిటన్న దానిపై సీనియర్ ఐఏఎస్ అధికారిఅయిన జవహర్ రెడ్డి లాంటి వారికి తెలీకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Tags:    

Similar News