వివేకా కేసు.. దేవిరెడ్డికి బెయిల్ వ‌ద్దు.. సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నాడు: సీబీఐ

Update: 2022-06-22 09:30 GMT
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి య‌మ డేంజ‌ర్ అని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఆయ‌న‌కు ఎట్టిప‌రిస్థితిలోనూ బెయిల్ ఇవ్వొద్ద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే.. పిటిష‌న‌ర్లు ఆరోపణలు చేస్తున్న ఇతరుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగుతోందన్న కారణంతో ఎంతకాలం పిటిషనర్లను జైల్లో ఉంచుతామని వ్యాఖ్యానించింది.

దీనికి సీబీఐ త‌ర‌ఫున న్యాయ‌వాది బ‌దులిస్తూ.. ఇతరుల పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నామని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు బదులిచ్చారు. ఫోరెన్సిక్‌, సాంకేతిక నివేదికలు అందాల్సి ఉందని.. దర్యాప్తు పురోగతిని సీల్డ్‌కవర్‌లో కోర్టు ముందుంచుతా మని తెలిపారు.

బెయిల్‌ కోసం నిందితులు వేసిన వ్యాజ్యాలపై సీబీఐ వాదనలు ముగియడంతో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరఫు వాదనలు వినేందుకు విచారణను హైకోర్టు ఈనెల 27కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

వివేకా హత్య కేసు నిందితులు వై.సునీల్‌యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5) హైకోర్టులో బెయిల్‌ పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. దర్యాప్తును దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రభావితం చేస్తున్నారని మంగళవారం జరిగిన విచారణలో సీబీఐ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. సాక్షులను, అధికారులను బెదిరిస్తున్నారని తెలిపారు.

న్యాయస్థానంనుంచి తాత్కాలిక అనుమతితో బయటకొచ్చిన ప్రతిసారి రాజకీయ పెద్దల ఫొటోలతో ఫ్లెక్సీ లు వేస్తూ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వివరించారు. దర్యాప్తు కొనసాగుతున్న ఈ దశలో బెయిలు మంజూరు చేయవద్దని విన్నవించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేసినందున పిటిషనర్‌ను ఇంకా జైల్లో ఉంచడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది పేర్కొంటున్నారని గుర్తుచేశారు.

అభియోగపత్రం దాఖలు చేశామన్న కారణంతో బెయిలు ఇవ్వాలనడం సరికాదని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దర్యాప్తులో స్థానిక పోలీసులు సహకరించడం లేదని అన్నారు. దర్యాప్తు అధికారిపై కేసు పెట్టి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని వివరించారు.
Tags:    

Similar News