వాళ్లకు చెక్: తిరుపతిలో డ్రోన్లతో గట్టి నిఘా

Update: 2021-07-25 07:30 GMT
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుపతి పట్టణం చెంత మరో సాహసోపేత నిర్ణయాన్ని పోలీసులు తీసుకున్నారు. ఆలయాలకు కొలువై ఉన్న తిరుపతిలో ఏపీ పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే మందుబాబుల ఆట కట్టించేందుకు డ్రోన్లను వినియోగించి సక్సెస్ అవుతున్నారు.

గడిచిన ఒకటిన్నర నెలల్లోనే బహిరంగంగా మద్యం సేవించినందుకు గాను ఇప్పటికే 100 మందికి పైగా మందుబాబులపై కేసులు నమోదు చేశారు. తిరుపతి పట్టణ ఎస్పీ వెంకట అప్పల నాయుడు మాట్లాడుతూ  పోలీసులు ప్రతిచోటకు వెళ్లలేరని.. అందుకే ఈ డ్రోన్ల ద్వారా నిఘాను పటిష్టం చేస్తున్నారని తెలిపారు. ఆకాశంలో డ్రోన్ల ద్వారా ఎవరు ఎక్కడ బహిరంగంగా మద్యం తాగినా ఈజీగా దొరికిపోతారని చెబుతున్నారు.

పోలీసుల కొరత దృష్ట్యా.. గల్లీల్లోకి వెళ్లలేని పరిస్థితులు ఉండడం.. బహిరంగ ప్రదేశాల్లో మూలలకు చేరుకోవడానికి వీలుగా డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. డ్రోన్లతో నగరంలో అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి తమకు వీలు కలుగుతోందని ఎస్పీ తెలిపారు.

పోలీసులు ప్రవేశించలేని ప్రాంతాలకు కూడా చేరుకోవడానికి డ్రోన్లు ఉపయోగపడుతాయని.. వీటి ద్వారా అసాంఘిక కార్యకలాపాలను నిరోధించవచ్చని ఎస్పీ తెలిపారు.

డ్రోన్ల ద్వారా ఇప్పటికీ చాలా మందిని గుర్తించామని.. ఈ డ్రోన్ల ద్వారా ఫొటోలు వీడియోలు తీసి  బహిరంగంగా మద్యం తాగిన వారిపై చర్యలు తీసుకున్నామని.. మరింత అప్రమత్తంగా పోలీసులు వ్యవహరించడానికి అవకాశం చిక్కిందని తెలిపారు.

డ్రోన్లు పోలీసులకు పనిని ఎంతో సులువు చేస్తున్నాయని.. ఈ విధమైన నిఘా ద్వారా చాలా సమయం ఆదా అవుతోందని ఎస్పీ తెలిపారు.

ప్రస్తుతం డ్రోన్లు కూడా తక్కువగానే ఉన్నాయని.. కేవలం మూడు డ్రోన్ల ద్వారానే సిటీ మొత్తం కవర్ చేస్తున్నట్టు తెలిపారు. మరిన్నింటిని సమకూర్చుకుంటే ఇంకా పటిష్టంగా నిఘా పెట్టగలమని వివరించారు.

ఇప్పటికే డ్రోన్ల ద్వారా తిరుపతి పట్టణంలో బహిరంగంగా మద్యం సేవించినందుకు రోజువారీగా 20 నుంచి 30 మందిని పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు. తిరుపతిలో ముగ్గురు డ్రోన్ ఆపరేటర్లను నియమించామని.. త్వరలోనే ఈ సంఖ్యను పెంచి మరింత నిఘా పెడుతామని తెలిపారు.
Tags:    

Similar News