ప్రణయ్ హత్య తర్వాత మళ్లీ..మారుతీరావు షెడ్డులో శవం

Update: 2020-03-01 06:30 GMT
కూతురు దళితుడిని పెళ్లి చేసుకుందని కక్ష గట్టి మిర్యాలగూడలో పరువు హత్య చేయించిన మారుతిరావు ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ హత్య కేసులో రిమాండ్ కు వెళ్లి బెయిల్ పై విడుదలై ప్రస్తుతం కేసును ఎదుర్కొంటున్నాడు మారుతీరావు. ఆయన కూతురుకు కొడుకు పుట్టగా.. అత్తింటివారితోనే ఉంటోంది.

తాజాగా మరోసారి మారుతిరావు  వార్తల్లో నిలిచారు. మిర్యాలగూడ శివారులో ఆయనకు చెందిన  స్థలంలో ఉన్న పాడుబడ్డ షెడ్డూలో ఓ కుళ్లిపోయిన శవం లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మారుతీరావుకు చెందిన స్థలంలో షెడ్డు కట్టి దాన్ని అలాగే చాలా ఏళ్లుగా అలానే వదిలేశారు. ఇటీవల ఆ షెడ్డు నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెళ్లి చూడగా గుర్తుతెలియని మృతదేహం కుళ్లిపోయి కనిపించింది.  మృతుడి వయసు 35-40 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 10 రోజుల కిందటే హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

మారుతిరావు నేర చరిత్ర చూసిన పోలీసులు అతడి షెడ్డులోని శవంపై దర్యాప్తు చేస్తున్నారు. మారుతిరావును ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత అసలు కారణాలు తెలియనున్నాయి. ఈ తాజా ఉదంతంలో మారుతిరావుకు సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


Tags:    

Similar News