ఈడీకి దొరికించినదీ...ఇరికించినదీ మనోళ్ళేనట..

Update: 2022-11-11 14:30 GMT
ఈడీ ఐటీ ఈ రెండు కూడా డబుల్ ఇంజన్ మాదిరిగా టీయారెస్ మంత్రులు, ఎంపీల మీద దూసుకువస్తున్నాయి. ఈడీ అంటే పెట్టే కేసులు వేరు, కానీ గ్రానైట్ లావాదేవీల విషయంలో ఈడీ దాడులేంటి మహాప్రభో అని టీయారెస్ మంత్రి గారైన గంగుల కమలాకర్ కి పెద్ద డౌటే వచ్చిందట. దాని మీద ఎంత బుర్ర బద్ధలు కొట్టుకున్నా అర్ధం కాని యవ్వాం అయిపోయిందిట.

అయితే తాపీగా  ఈడీ  ప్రకటన ద్వారా వచ్చిన సమాచారం మాత్రం ఆయన్ని ఖంగు తినిపించేసిందట. అదేంటి అంటే గ్రానైట్ లావాదేవీల గురించి మ్యాటర్ బయటపెట్టింది టీయారెస్ నాయకత్వాన నడిచే రాష్ట్ర ప్రభుత్వమే అని అంటున్నారు. ఎలా అంటే తెలంగాణాకు చెందిన విజిలెన్స్ అండ్ ఎంఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన ఒక నివేదిక ఆధారంగానే కేసులు పెట్టామని ఈడీ ఆ ప్రకటనలో చెప్పుకుని రావడంతో షాక్ తినడం మంత్రి గారు వంతు అయిందట.

ఇంతకీ విజిలెన్స్ అండ్ ఎంఫోర్స్మెంట్ వింగ్ చెప్పినది ఏంటి అంటే సముద్రమార్గాన రవాణా అవుతున్న గ్రానైట్ బ్లాకుల మీద పెద్ద ఎత్తున రాయల్టీ రావడం లేదని, దాన్ని ఎగవేత వేస్తున్నారు అని నివేదికలో పేర్కొన్నారుట. అది కూడా కరీం నగర్ నుంచి క్వారీ లీజుల ప్రాంతం నుంది సాగే ఎగుమతుల విషయంలో ఈ రకమైన లెక్కలు అపసవ్యంగా ఉన్నాయని పేర్కొనడంతోనే ఈడీ రంగంలోకి  దిగిపోయిందట.

అంతే కాదు ఎగుమతులు చేసే పరిమాణం ఎక్కువగా ఉంది. రాయల్టీ చెల్లింపులు చూస్తే తక్కువగా ఉన్నాయి. ఈ తేడాను ఈడీ అధికారులు బాగానే పట్టుకున్నారు. మరి ఈ గ్యాప్ లో వచ్చిన అక్రమ సొమ్మును ఏకంగా పెద్ద మొత్తంలోనే ఎగ్గొట్టారు అని ఈడీ తేల్చిందట. ఇక మరో విచిత్రం ఏంటి అంటే ఎగుమతి చేసిన తరువాత వచ్చే ఆదాయాన్ని బ్యాంక్ ఖాతాలలో చూపించడంలేదని ఈడీ గుర్తించింది.

అలా ఎగుమతి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇతర మార్గాల ద్వారా తీసుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలిందట. ఇలా హవాలా మొత్తంగా దీన్ని ఈడీ గుర్తించి దాడులు చేసిందని ఫలితంగా లెక్కకు తేలని మొత్తంగా ఈడీ సోదాలలో 1.08 కోట్ల సొమ్ము కనిపించిందని దాన్ని సీజ్ చేసిందని చెబుతున్నారు.

మరో వైపు చూస్తే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగుల పేరిట బినామీ ఖాతాలను తెరచి అందులో జమ చేయించిన సంగతిని కూడా ఈడీ గట్టిగానే పట్టుకుందని అంటున్నారు. ఇలా గ్రానైట్ ఎగుమతులను చేసినందుకు వచ్చిన మొత్తాన్ని హవాలా ద్వారానే స్వీకరించారు అని ఈడీ నిగ్గు తేల్చింది. ఏ బ్యాంకులూ అవసరం లేకుండా కొన్ని చైనీస్ సంస్థల ద్వారా భారతీయ సంస్థలకు ఈ డబ్బుని సక్సెస్ ఫుల్ గా మళ్ళించారు అని కూడా ఈడీ గుట్టు రట్టు చేసింది.

ఇందులో బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ రకమైన చైనీస్ సంస్థలుగా చెప్పబడుతున్నవి అన్నీ కూడా పనామా లీక్స్ లో ఉన్న లి వెన్‌హువోకు సంస్థకు చెందినవిగా ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇలా ఈడీ తమ దర్యాప్తు విషయంలో ఏం చేశాం, తమకు సమాచారం ఎలా అందింది అన్నది చక్కగా ప్రకటనలో వివరించేసరికి టీయారెస్ నేతలకు కళ్ళు తెరచుకున్నాయని అంటున్నారు.

ఇంతలా క్లారిటీ ఇస్తూ ఈడీ దూకుడు తో చేసిన ఈ దాడులు చూసిన తరువాత వాట్ టూ డూ అని ప్రశ్న వేసుకోవడమే మిగిలిందట. అయినా ఇది ఆరంభం మాత్రమే ఇంకా సినిమా చాలా ఉందమ్మా అని ఈడీ వైఖరే చెబుతోంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News