కరోనా టెస్ట్ చేసి విమానం ఎక్కించారు

Update: 2020-04-17 18:30 GMT
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానాలుగా గల్ఫ్ దేశాలకు చెందిన 'ఎమిరేట్స్' విమానాలకు పేరుంది. అయితే కరోనా దెబ్బతో ఇప్పుడు ఆ విమానాలన్నీ రద్దు అయిపోయాయి. తాజాగా 'ఎమిరేట్స్' విమానాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే తీవ్రమైన కండీషన్ ఒకటి ఎమిరేట్స్ సంస్థ పెట్టింది.

ఇక నుంచి ఎమిరేట్స్ విమానాలలో ఎక్కేముందు విమానాశ్రయంలో ప్రయాణికులకు రక్తపరీక్షలు తప్పనిసరి చేసింది. ప్రయాణించే ముందు కరోనా టెస్ట్ చేశాక నెగెటివ్ అని తేలితేనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు.

తాజాగా బుధవారం ఎమిరేట్స్ విమానాలు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమయ్యాయి. తొలి సర్వీసును 'ట్యూనీషియా' దేశానికి నడిపారు. ఈ ప్రయాణికులందరికీ విమానం ఎక్కేముందు రక్త పరీక్షలు చేశారు. దుబాయ్ ఆరోగ్య శాఖ ఈ మేరకు విమాన ప్రయాణికులకు రక్త పరీక్షలు చేసినట్టు ధృవీకరించడం దుమారం రేపింది.

పది నిమిషాల్లోనే కరోనా పరీక్షలు తేలే కిట్స్ పై వీటిని చేశారు. ప్రపంచంలోనే ఇలా విమానం ఎక్కేముందు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించిన మొదటి విమానయాన సంస్థ 'ఎమిరేట్స్' కావడం గమనార్హం.

అయితే కరోనా ప్రారంభ దశలో వైరస్ పరీక్షల్లో బయటపడదు. కానీ అతడి వల్ల సంక్రమణ మాత్రం చెందుతుంది. ఇలా కరోనా పరీక్షలు చేసినా దాని వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కాదని వైద్యులు చెబుతున్నారు. దీనికంటే విమాన ప్రయాణాలే వాయిదా వేయడం బెటర్ అని సూచిస్తున్నారు.
Tags:    

Similar News