ఏపీలో ఎమ్మెల్యేకి ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగం.. తాజా డీఎస్సీ నియామ‌కాల్లో అవ‌కాశం!

Update: 2022-06-21 07:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. 1998లో డీఎస్సీ రాసి ఎంపికైనా ఉద్యోగాలు ద‌క్కించుకోలేనివారికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వ‌రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఆ జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్య‌క్షుడు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ జాక్ పాట్ కొట్టారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన తాజా నియామ‌కాల్లో ఆయ‌న ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించారు. దీంతో క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. టీచింగ్ అంటే ఎంతో ఆస‌క్తి ఉన్న ఆయ‌న అప్పుడే స్కూలుకి వెళ్లిపోయి పాఠాల బోధ‌న కూడా మొద‌లు పెట్టేశారు.

క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ 30ఏళ్ల క్రితం మద్రాస్ అన్నామలై యూనివర్శిటీలో బీఈడీ చదివారు. పాతికేళ్ల క్రితం డీఎస్సీ రాసి ఇక ఉద్యోగం రాదని రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కూడా అయిపోయారు.

ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయంతో ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగానికి అర్హ‌త సాధించారు. 1998 డీఎస్సీలో టీచ‌ర్ ఉద్యోగం రాక‌పోవ‌డంతో జీవితంలో స్థిర‌ప‌డ‌టం కోసం బీఎల్ (బ్యాచిల‌ర్ ఆఫ్ లా) కూడా చేశానని ఎమ్మెల్యే ధ‌ర్మ‌శ్రీ చెబుతున్నారు. 1998 డీఎస్సీ బ్యాచ్ తరఫున సీఎం జగన్ కు ఆయన కృతజ్ఢతలు తెలియ‌జేస్తున్నారు.

కాగా ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఐదు వేల మంది అభ్య‌ర్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని చెబుతున్నారు. రెండు దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్ర‌భుత్వ నిర్ణ‌యం సంతోషాన్ని ఇచ్చింద‌ని పేర్కొంటున్నారు. ఇదే కోవలో అనకాపల్లి జిల్లా చోడవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉద్యోగానికి అర్హత సాధించారు.

మ‌రోవైపు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం డీఎస్సీ రాసి ఉద్యోగాలు రాక‌పోవ‌డంతో చాలామంది వివిధ వృత్తుల్లో స్థిర‌ప‌డిపోయారు. కొంత‌మంది వ్య‌వ‌సాయం, మ‌రికొంత‌మంది వ్యాపారాలు, ఇంకొంత‌మంది రాజ‌కీయాలు , మ‌రికొంత‌మంది చిన్నాచిత‌క ప‌నులు చేసుకుంటూ జీవితాన్ని వెళ్ల‌దీస్తున్నారు.

అలాంటివారు ఇప్పుడు.. అదీ 25 ఏళ్ల త‌ర్వాత ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చిందంటే న‌మ్మ‌లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం కుదురుకున్న‌దానిలో ఉండాలో లేక ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాన్ని తీసుకోవాలో తెలియ‌క డోలాయ‌మాన స్థితిలో ఉన్నారు. చిన్నాచిత‌క ప‌నులు చేసుకునేవారు మాత్రం ప్ర‌భుత్వ ఉద్యోగం వైపే మొగ్గుచూపుతున్నారు.
Tags:    

Similar News