అసద్ ను ముస్లింలు బ్యాన్ చేయాలన్న హాఫిజ్ గులాం

Update: 2019-11-11 13:15 GMT
అయోధ్యపై సుప్రీంతీర్పు అన్ని వర్గాల వారు స్వాగతిస్తున్న వేళ.. మజ్లిస్ అధినేత కమ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ అసద్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముస్లింలకు అసద్ పెద్దన్న ఏ మాత్రం కాదని.. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆటలు ఆడొద్దంటూ పలువురు అభ్యంతరం చేస్తున్నారు.

ఇలాంటివేళ.. అసద్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీకి చెందిన హాఫిజ్ గులాం సర్వర్.  అయోధ్యపై సుప్రీం తీర్పుపై అసద్ స్పందన ఏ మాత్రం సరికాదన్న ఆయన.. ఆయన తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. మత రాజకీయాల కోసమే సుప్రీం తీర్పు మీద అసద్ మండిపాటుగా అభివర్ణించారు. ఓవైసీ లాంటి కొంతమంది నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.

అసద్ లాంటి వారిని దేశంలోని ముస్లింలు బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అయోధ్య భూవివాదం మీద సుప్రీం ఇచ్చిన తీర్పు చారిత్మకమన్న ఆయన.. సుప్రీం న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

దేశంలోని ముస్లింలు మతతత్వం రాజకీయాల్ని వదిలేసి దేశాభివృద్ధిపై మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైనాతో పోలిస్తే.. భారత్ ఇంకా 4జీతో కష్టపడుతోందని.. కానీ చైనా మాత్రం 5జీ టెక్నాలజీలోకి మారిందన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని ముస్లింలు చాలా మంది ఇంకా గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారని.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు.

వారి పరిస్థితి దళితుల కంటే దారుణంగా ఉందని.. అలాంటి వారి జీవన స్థితిని మెరుగుపర్చేందుకు అసద్ లాంటి వారు ప్రయత్నించాలన్నారు. మత రాజకీయాలతో ప్రయోజనం పొందే అసద్ లాంటి వారిని తాము అడ్డుకుంటామన్నారు. ముస్లిముల అభివృద్ధికి నేతలు పాలుపడాలని గులాం ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ అసద్ ను ఏ విషయంలో తప్పు పట్టని తీరుకు భిన్నంగా తన సొంత వర్గం నుంచే వస్తున్న ఈ వ్యతిరేకత చూసిన తర్వాత అయినా.. తన తీరును మజ్లిస్ అధినేత మార్చుకుంటారేమో చూడాలి.
Tags:    

Similar News