ఫలక్ నుమా ప్యాలెస్ లో 500 కార్లు.. 1500 అతిథులతో హైప్రొఫైల్ పార్టీ?

Update: 2021-03-27 17:30 GMT
ఓవైపు కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇలాంటివేళ.. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన హైప్రొఫైల్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని ఒక మీడియా సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన హోటల్ గా పేర్కొనే ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన ఈ పుట్టిన రోజు వేడుకకు 1500 మంది హైప్రొఫైల్ అతిధులు హాజరైనట్లు చెబుతున్నారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. అరబిందో ఫార్మా అధినేతలు వియ్యంకులు. విజయసాయి కుమార్తెను అరబిందో ఫార్మా అధినేత కుమారుడికిచ్చి పెళ్లి చేశారు. తాజాగా వారి మనమళ్ల (కవలలు) పుట్టిన రోజు సందర్భంగా భారీగా వేడుకల్ని నిర్వహించారు. ఫలక్ నుమా ప్యాలస్ లో ప్రత్యేక ఏర్పాట్లతోఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచే ప్యాలెస్ వద్ద సందడి షురూ అయ్యింది.

సుమారు 500లకు పైగా ఖరీదైన కార్లు ఫలక్ నుమా ప్యాలెస్ వద్దకు చేరుకున్నాయి. సుమారు 1500 మంది వరకు ఈ వేడుకకు హాజరైనట్లు చెబుతున్నారు. ఇంత భారీగా వేడుక జరగటం ఆసక్తికరంగా మారింది. రాజకీయ.. వ్యాపార.. పారిశ్రామిక వర్గాలకు చెందిన అతిధులతో ప్రాంగణం హడావుడిగా మారిందని చెబుతున్నారు. ఈ విందు ఆద్యంతం అత్యంత విలాసవంతంగా సాగినట్లు చెబుతున్నారు. భారీ ఖర్చుతో చేసిన ఈ వేడుక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో.. ప్రముఖుల కుటుంబాల్లో ఇంత భారీగా వేడుకను నిర్వహించటమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News