జగన్ మళ్లీ పాదయాత్రకు రెడీ

Update: 2016-07-07 08:04 GMT
 రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న వైసీపీ అధినేత మళ్లీ మైలేజి పెంచుకోవడానికి తన తండ్రి నుంచి వచ్చిన పాత ఫార్ములానే నమ్ముకోబోతున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను టీడీపీకి కోల్పోయిన ఆయన జనంలోకి వెళ్లి ప్రజలకు అన్ని విషయాలను వివరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  త్వరలో ఆయన ఏపీలో అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జగన్ సుదీర్ఘ పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా వైసీపీ నేత గొల్ల బాబూరావు ఓ కార్యక్రమంలో ఈ విషయం ప్రకటించారు కూడా. అనంతపురం జిల్లాలో మొదలై శ్రీకాకుళం వరకు పాదయాత్ర సాగుతుందని బాబూరావు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలను అధ్యయనం చేయడం.. ప్రజలతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం లక్ష్యంగా ఆయన యాత్ర సాగుతుందని చెప్పారు.

కాగా చంద్రబాబు పట్ల ప్రజల్లో నమ్మకం క్రమంగా పోతోందన్నది జగన్ అభిప్రాయం. అయితే.. ఆ అవకాశాన్ని వినియోగించుకోవడంలో పార్టీ నేతలు పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నారని.. అందుకే తానే స్వయంగా ప్రజల్లోకి వెళ్లి పరిస్థితులు వివరించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో అంతకుముందే పాదయాత్ర మంచి మార్గమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై జగనే స్వయంగా త్వరలో ప్రకటన చేస్తారని అంటున్నారు.
Tags:    

Similar News