లేడీ హిట్ల‌ర్‌ గా కిమ్ సోద‌రి: ప‌రోక్షంగా దేశ బాధ్య‌త‌లు

Update: 2020-07-11 00:30 GMT
ఉత్త‌ర కొరియా ఈ పేరు వింటేనే అంద‌రికీ అణ్వాయుధాలు.. యుద్ధ వాతావ‌ర‌ణ‌మే గుర్తుకు వ‌స్తుంది. అన్నిటి క‌న్నా ముఖ్యంగా ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్ జొంగ్ ఉన్‌. ఆధునిక నియంతగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు అత‌డి క‌న్నా లేడి హిట్ల‌ర్‌గా అత‌డి సోద‌రి కిమ్ యో జోంగ్ నిలుస్తున్న‌ట్టు ఆ దేశం ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దేశ సారధ్య బాధ్యతలు ఆమె స్వీక‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. దానికి నిద‌ర్శ‌నంగా ఆ దేశంలో ప‌రిణామాలు మారుతున్నాయి.

అమెరికా అధ్య‌క్షుడు డొనల్డ్ ట్రంప్, ఉత్త‌ర కొరియా కిమ్‌జొంగ్ మధ్య ఈ ఏడాది ఓ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటుకావొచ్చంటూ వార్తలు వ‌స్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఓ దశలో ధృవీకరించారు. కిమ్‌జొంగ్ అంగీకరిస్తే ట్రంప్ భేటీ అవుతారంటూ నాలుగు నెలల కిందట వైట్ హౌస్ ఓ ప్రకటన చేసింది. అణ్వస్త్ర దేశంగా ఉత్తర కొరియా ఆవిర్భవించడంతో వారిద్దరి మధ్య ఓ హైప్రొఫైల్ సమావేశం ఏర్పాటు కావొచ్చంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటిపై తాజాగా ఉత్త‌ర కొరియా స్పందించింది. ఆ వ‌స్తున్న వార్త‌ల‌న్నింటినీ తోసిపుచ్చింది.

అలాంటి ప్రతిపాదనలను ఉత్తర కొరియా ప్రభుత్వం కొట్టి పారేసింది. డొనాల్డ్ ట్రంప్‌తో తన సోదరుడు కిమ్‌జొంగ్ ఎలాంటి సమావేశాన్నీ నిర్వహించట్లేదంటూ అత‌డి సోద‌రి కిమ్ యో జొంగ్ స్పష్టం చేసింది. న్యూక్లియర్ డిప్లొమసీ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య షెడ్యూల్డ్ సమావేశాలు ఏవీ ఇప్పట్లో ఉండకపోవచ్చని ఆమె ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 2018లో డొనాల్డ్ ట్రంప్-కిమ్‌జొంగ్ మధ్య ఓ అత్యున్నత స్థాయి సమావేశం జ‌రిగిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా మరోసారి ఆ ఇద్దరు దేశాధినేతలు స‌మావేశం కావాల్సి ఉంది. అయితే ఈ ప్ర‌క‌ట‌న కిమ్ సోద‌రి కిమ్ యో జోంగ్ ప్ర‌క‌టించ‌డం ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ర్షించింది. కొన్ని నెల‌లుగా ఆమె ఉత్త‌ర కొరియా ప్ర‌భుత్వంలో కీల‌కంగా మారారు. ప‌రిపాల‌న‌లో జోక్యం చేసుకుంటున్నారు. భ‌విష్య‌త్ దేశ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంలో భాగంగా ఆమె ఇప్పుడు ప్ర‌భుత్వంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కిమ్‌జొంగ్ అనారోగ్యానికి గురైనప్ప‌టి నుంచి ప‌రోక్షంగా ఆమె ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఆయనకు సర్జరీ నిర్వహించారు. ఆ తరువాత ఆయన కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.

సర్జరీ అనంతరం కిమ్‌జొంగ్ మూడుసార్లు మాత్రమే ప్రపంచానికి కనిపించారు. అత‌డి ఆరోగ్యం మ‌ళ్లీ దెబ్బ‌తింద‌ని.. దీంతో పరిపాలనా వ్యవహారాల్లో పాల్గొనలేకపోతున్నారని అంత‌ర్జాతీయంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అత‌డు త‌న సోదరి కిమ్ యో జొంగ్‌కు బాధ్య‌త‌లు ఇచ్చార‌ని తెలుస్తోంది. ఆమె ప్ర‌స్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టారు. అధ్య‌క్షుడిగా కిమ్ కొన‌సాగుతున్నా ప‌రోక్షంగా ఆమెనే ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె లేడీ హిట్ల‌ర్‌గా పేరు తెచ్చుకుంటున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News