బీఆర్ఎస్ ‘కోడి పందేల’ రాజకీయం..రంగంలోకి ఆ మంత్రులు..

Update: 2023-01-09 08:30 GMT
జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారింది. ఇక ఆ పార్టీని విస్తరించే పనిలో కేసీఆర్ బిజీ అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరనేది ఇంకా తేలలేదు. కానీ పొరుగు రాష్ట్రాల్లో మాత్రం కమిటీలు వేసేందుకు ప్లాన్ వేస్తున్నారు.  ఇప్పటికే ఏపీకి అధ్యక్షుడిని ప్రకటించిన గులాబీ బాస్.

తొందర్లోనే అక్కడ పార్టీ కార్యాలయాన్ని స్ట్రాట్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి సందర్భంగా ఏపీలో నిర్వహించే కోడి పందేల కార్యక్రమాన్ని బీఆర్ఎస్ వాడుకోనుంది. ఈ పోటీల్లో బీఆర్ఎస్ ను పరిచయం చేయనున్నారట. అందుకోసం తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు రంగంలోకి దిగనున్నారు.

బీఆర్ఎస్ ను ఏపీలో విస్తరించడానికి ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే ఏపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుదామని వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించారు. వారిలో తోట చంద్రశేఖర్ అనే నాయకుడిని అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు మరింత విస్తరించేందుకు కేసీఆర్ న్యూ స్కెచ్ వేశారు. ఇందుకోసం తెలంగాణకు చెందిన కొందరు మంత్రులను ఏపీకి పంపే ప్రయత్నం చేస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు జోరుగా సాగుతాయి. వీటి నిర్వహణపై కోర్టులు కూడా అడ్డు చెప్పలేదు. దీంతో విదేశాల్లో, ఇతర ప్రదేశాల్లో ఉన్న ప్రముఖులంతా ఈ సమయాల్లో అక్కడ వాలిపోతారు. కోట్లకు కోట్లు పెట్టి గేమ్ ఆడుతారు. విన్నర్లు, పరాజితులంతా కలిసి పండుగ చేసుకుంటారు. ఇప్పటి వరకు కోడి పందేల కార్యక్రమాల్లో పాల్గొనడానికి తెలంగాణ నుంచి బడా నేతలు వెళ్లేవారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారికంగా ఇందులో పార్టిసిపేట్ చేయనుంది.

కోడిపందేల్లో పాల్గొనడానికి కొందరు మంత్రులు అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడికి వచ్చిన నేతలను మచ్చిక చేసుకొని వారితో పరిచయాలు పెంచుకోనున్నారు. పార్టీలకతీతంగా కోడి పందేల్లో నాయకులు పాల్గొంటారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు కూడా ఇందులో పాల్గొని బీఆర్ఎస్ గురించి వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఆ తరువాత ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతల వివరాలు తెలుసుకొని వారిని చేరదీసేలా ప్లాన్ వేయనున్నారు. అయితే తెలంగాణ నుంచి ఎవరెవరు ఈ కోడి పందేళ్ల కార్యక్రమాల్లో పాల్గొంటారనే విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు కేసీఆర్ నేరుగా ఈ విషయంపై ఇంట్రెస్ట్ పెట్టడంతో చాలా మంది ఉత్సహంగా ఉన్నారు.

గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏపీలో జరిగే కోడి పందేళ్ల కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉత్సాహం చూపేవారు. కానీ అధిష్టానం గీత దాటొద్దనే ఉద్దేశంలో కామ్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ అధినేత ఆదేశాలతో వెళ్లడానికి చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు. అయితే మంత్రులు సరదా కోసం వెళ్లడం కాదు.. కనీసం కొంతమందినైనా ప్రభావితం చేయాలన్న టార్గెట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ మంత్రులు కృషి ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
Tags:    

Similar News