ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2022-11-23 04:10 GMT
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కేంద్రంలోని మోడీ సర్కారుకు.. తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారుకు మధ్య నడుస్తున్న లడాయి సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నంతవరకు అంతా బాగుందన్న మాటను ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చేలా చేసిన కేసీఆర్.. లెక్కలు తేడా వచ్చిన తర్వాత నుంచి పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తమతో సరిగా లేని వారికి ఐటీ.. ఈడీ..సీబీఐ బూచిలతో తమ దారికి తెచ్చుకునే అలవాటు మోడీషాలకు ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వాటి విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే పీహెచ్ డీ చేసి ఉండటం తెలిసిందే. అందుకే.. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణ రాష్ట్రంలో సోదాలు.. కేసులతో కేసీఆర్ ను టార్గెట్ చేయటం సాధ్యం కాదన్న మాట వినిపిస్తుంది. అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ పార్టీకి చెందిన నేతలు.. తమ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారిని ఐటీ.. ఈడీ.. సీబీఐ టార్గెట్ చేసిన నేపథ్యంలో ఇటీవల పరిణామాలు వాతావరణాన్ని వేడెక్కించేలా చేస్తున్నాయి.

మంగళవారం నుంచి మొదలైన మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయనకు చెందిన వారి ఇళ్లు.. కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ సోదాలు మరో సంచలన మలుపు తిరిగినట్లుగా చెప్పాలి. మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ సోదాలు అర్థరాత్రి వరకు సాగాయి. మరోవైపు.. ఈ రోజు (బుధవారం) ఉదయమే మళ్లీ సోదాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతీ నొప్పి రావటం.. సూరారంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తనపై జరుగుతున్న ఐటీ సోదాల వేళ.. మంత్రి మల్లారెడ్డి సీన్లోకి వచ్చి.. రెండు వేళ్లు (విక్టరీ సింబల్) చూపించి.. కాస్తంత హడావుడి చేయటం అందరిని అవాక్కుఅయ్యేలా చేసింది. సాధారణంగా ఐటీ అధికారులు.. ఈడీ.. సీబీఐ సోదాలు జరుగుతున్నప్పుడు మాట్లాడటానికి.. ముఖం చూపించటానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటి తీరుకు భిన్నంగా బాజాప్తా అన్నట్లుగా బయటకు వచ్చి.. విక్టరీ సింబల్ చూపించి మల్లారెడ్డి వెళ్లారు. ఈ రోజు తన కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతీ నొప్పికి గురయ్యారన్న విషయం తెలిసినంతనే.. మంత్రిమల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.

తన కుమారుడ్ని ఐటీ అధికారులు కొట్టారని.. భౌతికంగా దాడులు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. తన కుమారుడ్ని వైద్యులు పరీక్షిస్తున్నారని.. ఒకవేళ దెబ్బలు కొట్టినట్లుగా వైద్యులు చెబితే తాను పోలీసులకు ఐటీ అధికారుల మీద కంప్లైంట్ ఇస్తానని పేర్కొన్నారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈడీలు బోడీలు మనల్నేం చేయలేరని.. వారికి సరైన రీతిలో బుద్ధిచెబుదామని ఆ మధ్యన ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావటం.. అదెలా అన్నది మంత్రి మల్లారెడ్డి తాజా వ్యాఖ్యలతో చెప్పేశారని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News