దావూద్ కు మోడీ స్పాట్ పెట్టేశారా?

Update: 2015-08-19 04:17 GMT
దేశాన్ని విడిచి పెట్టి.. శత్రుదేశంతో చేతులు కలిపి భారత్ లో అల్లకల్లోలం సృష్టించటం.. మారణహోమానికి ప్లాన్ చేయటం.. వందలాది మంది ప్రాణాల్ని బలి తీసుకోవటమే కాదు.. తన అక్రమ వ్యాపారం.. అడ్డగోలు వ్యవహారాలకు భారత్ ను కేంద్రంగా చేసుకొని మాఫియా సామ్రాజాన్ని ఏలుతున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ కు స్పాట్ పెట్టారా? అతని వ్యవహారాలపై సాక్ష్యాత్తు ప్రధానమంత్రే దృష్టి సారించారా? అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది.

ముంబయి పేలుళ్లకు ప్లాన్ చేయటంతో పాటు.. వందలాది మంది మరణాలకు కారణమైన దావూద్.. పాక్ ఆశ్రయం పొంది అక్కడ కులాసాగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. పాక్ లో అతగాడు లేడంటూ పాక్ బుకాయించటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ లోని దావూద్ నివాసానికి సంబంధించిన నాలుగు ఇళ్లను భారత అధికారులు గుర్తించారు. ఇస్లామాబాద్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురీలో ఉన్న దావూద్ ఇంటిని.. కరాచీలోని మూడు ఇళ్లకు సంబంధించి వివరాల్ని సేకరించిన నిఘా వర్గాలు ఒక నివేదికను రెఢీ చేసినట్లుగా చెబుతున్నారు.

పాక్ లో దావూద్ కు సంబంధించిన వివరాల్ని ఈ నెలలో జరిగే రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాక్ అధికారులకు అందిస్తారన్న మాట వినిపిస్తోంది. తన యూఏఈ పర్యటన సందర్భంగా తాను కలిసిన నేతలతో దావూద్ వ్యవహారాన్ని మోడీ ప్రముఖంగా ప్రస్తావించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దావూద్ ను ఫిక్స్ చేయటం..అతని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని భారత్ ప్రయత్నిస్తోందని.. అందుకు మోడీ కీలకభూమి పోషించాలని భావిస్తున్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.  అన్ని వైపుల నుంచి ఒత్తిడిని పెంచి.. దావూద్ ను భారత్ కు రప్పించాలన్న అంశంపై ప్రధాని వ్యక్తిగతంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్ని చూస్తుంటే.. దావూద్ కు మూడినట్లేనన్న భావన కలగటం ఖాయం.
Tags:    

Similar News