ఐఎస్‌ బీలో పాఠంగా నిజామాబాద్ ఎన్నిక‌

Update: 2019-05-09 08:12 GMT
నిజామాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం...కొద్దికాలం క్రితం వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల‌లోని వారికే తెలుసు. కానీ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌తో దేశ‌వ్యాప్తంగా సుప‌రిచితం అయింది. క‌డుపు మండిన రైతులు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య క‌విత పోటీ చేసిన ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగారు. 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్ లోక్‌ సభ స్థానంలో 27 వేల బ్యాలెట్ యూనిట్లు వినియోగించారు. ఇక్కడ ప్రతి పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలను ఉపయోగించారు. అత్యధిక ఈవీఎంల ద్వారా నిర్వహించిన ఈ ఎన్నికను గిన్నిస్‌ బుక్‌ లో నమోదు చేయడానికి గిన్నిస్‌ బుక్ కన్సల్టెంట్‌ ను సంప్రదించామని తెలంగాణ ఎన్నిక‌ల సీఈఓ రజత్‌ కుమార్ ఇప్ప‌టికే తెలిపారు.తాజాగా, ఆయ‌న మ‌రో ఆస‌క్తిక‌ర అంశం వెల్ల‌డించారు.

నిజ‌మాబాద్ పార్ల‌మెంటు ఎన్నిక‌ను భారీ ఏర్పాట్ల‌తో నిర్వ‌హించ‌డం చారిత్రాత్మక ఘట్టంగా ర‌జ‌త్‌ కుమార్ తెలిపారు.  ప్రతి పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలను ఉప‌యోగించడంతో - 27 వేల బ్యాలెట్ యూనిట్లు వినియోగించామని తెలిపారు.  ప్రపంచంలోనే ఒక ఎన్నికకు ఇన్ని ఈవీఎంలు ఉపయోగించడం ఇదే ప్రథమమని వెల్లడించారు. సాధారణంగా ఒక్కో నియోజకవర్గాన్ని 15 లేదా 16 మంది ఇంజినీర్లు పర్యవేక్షిస్తే...నిజామాబాద్‌ లో సుమారు 600 మంది పనిచేశారని తెలిపారు. నిజామాబాద్‌ లో 261 బ్యాలెట్ యూనిట్లు - 55 కంట్రోల్ యూనిట్లు - 87 వీవీప్యాట్లు మాత్రమే రీప్లేస్ అయ్యాయని వివరించారు. ఈ భారీ ఏర్పాట్ల‌పై గిన్నీస్‌ బుక్‌ ను సంప్ర‌దించ‌గా వారు ఒక ప్రశ్నావళిని ఇచ్చారని, దానిని పూర్తిచేసి సమర్పించామని చెప్పారు. తాజాగా, ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ ను సంప్ర‌దించామ‌న్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణను మేనేజ్‌మెంట్ విద్యార్థులకు కేస్‌ స్టడీగా రూపొందించి చెప్పాలని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌ బీ)ని కోరినట్టు సీఈవో రజత్‌ కుమార్ తెలిపారు. 185 మంది పోటీచేసి ఈ ఎన్నికను చాలెంజ్‌ గా తీసుకొని 2 లక్షల గంటలు శ్రమించామన్నారు. గిన్నిస్ రికార్డుగా నమోదు చేయాలని ఇదివరకే కోరిన‌ట్లు పేర్కొంటూ వారి స్పంద‌న కోసం ఎదురుచూస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా, నిజామాబాద్ ఫలితాలను రౌండ్ల వారీగా వెల్లడించడం ఆలస్యమవుతుంది కానీ, 24 గంటల్లోనే వెల్లడిస్తామన్నారు.     



Tags:    

Similar News