కొత్త వివాదం; బీబీసీలో ‘సిక్కు’ రచ్చ

Update: 2015-10-19 18:22 GMT
ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ నిర్వహించిన ఒక టాక్ షో ఇప్పుడు సెగలు పుట్టిస్తోంది. ఇటీవల పంజాబ్ లో చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో మీడియా వ్యవహరించిన వైఖరిపై ఒక చర్చా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఊహించని పరిణామాలతో బీబీసీ ఇబ్బందుల్లో పడింది.

పంజాబ్ లో సిక్కులపై జరుగుతున్న హింసపై మీడియా వివక్ష తో వ్యవహరిస్తుందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై మాట్లాడేందుకు బీబీసీ ఛానల్ కు వచ్చిన సిక్కు ప్రతినిధి జగ్మీత్ సింగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పంజాబ్ లో సిక్కుల్ని చంపేస్తుంటే ఎవరూ పట్టించుకోవటం లేదని.. మీడియా సైతం పక్షపాతంతో వ్యవహరిస్తుందని ఆవేశ పడిపోయారు.

ఇతగాడి ఆవేశాన్ని తగ్గిస్తూ.. అనునయంగా మాట్లాడుతూ బీబీసీ యాంకర్ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావటానికి ప్రయత్నించింది. అయితే.. అదేమీ వర్క్ వుట్  కాకపోవటంతో.. యాంకర్ గా వ్యవహరిస్తున్న సియాన్ విలియమ్స్ కు అగ్రహం వచ్చేసింది.

శాంతంగా మాట్లాడతారా? లేక.. మైక్ చేయాలా అని వారించే ప్రయత్నం చేసింది. అప్పటికి తగ్గకపోయేసరికి.. షో నుంచి బయటకు పంపాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చేశారు. అంతలోనే టీవీ తెర మీద సంబంధం లేని విజువల్స్ రావటంతో పలువురు గందరగోళ పడిపోయారు. తాజా ఉదంతంలో బీబీసీ తమను అవమానించిందని సిక్కులు ఆరోపిస్తున్నారు. బ్రిటన్ లోని ఒక సిక్కు సంస్థ జరిగిన ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. తమ గొంతు వినిపించకుండా.. బయటకు రాకుండా తమ గొంతు నొక్కేశారంటూ విమర్శించింది. ఇదిలా ఉంటే.. జరిగిన పరిణామంలో తమ యాంకర్ వ్యవహరించిన వైఖరిని బీబీసీ సమర్థించుకుంది. సిక్కు రచ్చలో ఇరుక్కుపోయిన బీబీసీ మరెలా బయటపడుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News