ఇదేం ఖర్మ పోలీసులకు.. ఏపీలో కానిస్టేబుల్‌ వినూత్న నిరసన!

Update: 2023-01-02 07:46 GMT
రెండేళ్లుగా పెండింగ్‌ బకాయిలు చెల్లించకుండా పోలీసులతో జగన్‌ ప్రభుత్వం బలవంతంగా పనులు చేయించుకుంటోందని అనంతపురం జిల్లాలో డిస్మిస్‌ అయిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ సంచలన ఆరోపణలు చేశారు. దీన్ని నిరసిస్తూ జనవరి 1న తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆయన అనంతపురం జడ్పీ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు దిగారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రకాశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లో 70వేల మంది పోలీసులకు సుమారు రెండేళ్లుగా 20 టీఏలు, 5 డీఏలు, 2 ఎస్‌ఎల్‌ఎస్‌లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. సకాలంలో బకాయిలు అందక పోలీసులు సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలపై రెండేళ్లుగా పోరాడుతున్నా ముఖ్యమంత్రి, డీజీపీ, హోం మంత్రి స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

వీటిపై తాను ప్రశ్నించినందుకే పోలీసు ఉన్నతాధికారులు తనను డిస్మిస్‌ చేసి కడుపుకొట్టారని ప్రకాశ్‌ ఆరోపించారు. బకాయిలు విడుదలయ్యే వరకు తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనంతపురం రెండో పట్టణ పోలీసులు ప్రకాశ్‌ ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

కాగా›ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నుంచి పోలీసులకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలపై గత ఏడాది జూన్‌ 14న అనంతపురం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను విధుల్లోంచి తొలగించిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది జూన్‌ 14న శ్రీసత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆరోజు ప్రకాశ్‌ అనంతపురం జిల్లా పోలీస్‌ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద.. ప్రభుత్వం పోలీసుల బకాయిలు చెల్లించాలంటూ ప్లకార్డు ప్రదర్శించారు. ‘ఏపీ సీఎం జగన్‌ సార్‌.. సేవ్‌ ఏపీ పోలీస్‌. గ్రాంట్‌ ఎస్‌ఎల్‌ఎస్, ఏఎస్‌ఎల్‌ఎస్‌ ఎరియర్స్‌. సామాజిక న్యాయం ప్లీజ్‌’ అంటూ ఆ ప్లకార్డుపై పేర్కొన్నారు. దాన్ని పట్టుకుని కూర్చుని తన నిరసన తెలిపారు.

దీంతో ప్రభుత్వం ఎస్‌ఎల్‌ఎస్‌లు, టీఏ బకాయిలను మరుసటి రోజే పోలీసుల ఖాతాల్లో వేసింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రకాశ్‌కు మద్దతుగా నిలవడంతో కొన్నిరోజుల పాటు ఏ చర్యలూ తీసుకోలేదు. అయితే ప్రకాశ్‌ పై నిఘా పెట్టారని వార్తలు వచ్చాయి. ఫోన్‌ కాల్స్‌ పైనా నిఘా ఏర్పాటు చేశారు. ప్రకాశ్‌ తన ఇంటి నుంచి బయటకు రాకుండా కొన్నిరోజుల పాటు ఇంటి వద్ద పోలీసులను కాపలా పెట్టారు. అంతేకాకుండా అతడి బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింపజేశారు. నిరసన తెలిపారన్న కారణంతో జిల్లా కేంద్రానికి దూరంగా డ్యూటీ వేశారు. నిరసన తెలిపినందుకు, గతంలో 2019లో నమోదైన ఓ కేసులో ఒకేరోజు మూడు నోటీసులు ఇచ్చి కక్షసాధింపు చర్యలకు దిగారని విమర్శలు వచ్చాయి.

అయితే సీఎం జగన్‌ కు నిరసన తెలిపినందుకు అన్నట్టు కాకుండా 2019లో అనంతపురం జిల్లా గార్లదిన్నెలో కానిస్టేబుల్‌పై నమోదైన ఓ కేసులో అభియోగం రుజువైందంటూ ప్రకాశ్‌ ను డిస్మిస్‌ చేయడం గమనార్హం. కాగా కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ గతేడాది ఆగస్టు 24న మెడికల్‌ లీవ్‌ పెట్టి సొంతూరు కదిరికి వెళ్లగా ఆయనను డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతపురం డీపీవోలో ప్రకాశ్‌ నివాసముంటున్న క్వార్టర్‌లోని ఇంటి తలుపునకు అధికారులు ఈ డిస్మిస్‌ ఉత్తర్వులు అంటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News