కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు.. ఆర్‌ఆర్‌ఆర్‌ మరో సంచలనం!

Update: 2023-01-16 10:30 GMT
వైఎస్సార్సీపీ నరసాపురం రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజుకు, జగన్‌ ప్రభుత్వానికి మధ్య వార్‌ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత పొడసూపిన విభేదాలతో వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. అప్పటి నుంచి ఏకుకు మేకులా మారి జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైఎస్సార్సీపీ నేతల నుంచి అంతే ధీటుగా రఘురామపై కౌంటర్లు పడుతున్నాయి.

నిత్యం సోషల్‌ మీడియా, యూట్యూబ్, మీడియా సంస్థల ద్వారా జగన్‌ ప్రభుత్వంపై, ఏపీ రాజకీయాలపైన రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిత్యం 'రచ్చబండ' పేరుతో జగన్‌ ప్రభుత్వ విధానాలపై రఘురామ నిప్పులు చెరుగుతున్నారు.

కొద్ది రోజుల క్రితం ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రఘురామ హాట్‌ కామెంట్స్‌ చేశారు. టీడీపీ, జనసేనకు తోడు మూడో పార్టీ కూడా ఈ రెండు పార్టీలతో జత కడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఓ ప్రభంజనమవుతుందని రఘురామ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలకు మూడో పార్టీ కూడా జత కలుస్తుందన్నారు. తద్వారా పరోక్షంగా బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో కలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా ఏపీలో విస్తృతంగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. అందులోనూ కోడి పందేలు అంటే అందరికీ గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలే. అందులోనూ భీమవరం.. కోడి పందేలకు రాజధానిలాంటిది. భీమవరం రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం నియోజకవర్గంలోనే ఉంది.

అయితే రఘురామపై రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారంటూ ఆయనను గతంలో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌ వచ్చాక రఘురామ పూర్తిగా హైదరాబాద్, ఢిల్లీల్లోనే ఉంటున్నారు. ఏపీకి వస్తే అరెస్టు చేస్తారని ఆయన రావడం లేదు.

అయితే రఘురామకు కోడి పందేలు అంటే చాలా ఇష్టం. గతంలో పోలీసులు కోడిపందేలపై ఉక్కుపాదం మోపితే ఆయనే కోర్టుకెళ్లి సానుకూల ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆయన హడావుడి ఒక రేంజులో ఉండేది. అయితే గత కొంతకాలంగా ఏపీకి వచ్చే పరిస్థితి ఆయనకు లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది కోడి పందేలకు ఆయన దూరమయ్యారు.

ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు కోడి పందేలకు రాలేకపోయినా ఆయన అభిమానులు రఘురామ భారీ కటౌట్‌ ను ఏర్పాటు చేయడం విశేషం. కోడి పుంజును పట్టుకుని రఘురామ ఉన్న ఈ నిలువెత్తు కటౌట్‌ ఆయన అనుచరులు, అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలని ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. కోడిపందేలకు ప్రధాన కేంద్రమైన భీమవరంలో ఈ భారీ కటౌట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News