భారత్ చెప్పిందే వేదం.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ హాట్ కామెంట్స్

Update: 2022-06-21 14:30 GMT
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, డ్యాషింగ్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మరోసారి బీసీసీఐపై, భారత క్రికెట్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ ను విస్తరించడానికి బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ ప్రపంచాన్ని భారత్ శాసిస్తోందని.. దీనికి కారణంగా అతిపెద్ద క్రికెట్ మార్కెట్ గా భారత్ ఆవిర్బవించడమేనన్నారు.

క్రికెట్ ఆడే దేశాలన్నింటిని శాసించే స్థాయిలో భారత్ అవతరించిందని ఓ టాక్ షోలో షాహిద్ అఫ్రిది అన్నారు. భారత్ ఏం చెబితే అదే జరుగుతుందని స్పష్టం చేశారు. భారత్ చెప్పిన విషయాన్ని క్రికెట్ ఆడే అన్ని దేశాలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించాయి.

ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న సమయంలో అంతర్జాతీయ టోర్నమెంట్లను కూడా వాయిదా వేసుకోవడమో.. రీషెడ్యూల్ చేసుకోవడమో జరుగుతోందని .. క్రికెట్ పై భారత్ సాధించిన ఆధిపత్యానికి అది నిదర్శనమని షాహిద్ అఫ్రిది పేర్కొన్నారు.

ఐపీఎల్ వేలం పాటలో పాకిస్తాన్ క్రికెటర్లను పాల్గొనకపోవడానికి కారణాన్ని వివరించారు. రాజకీయ పరంగా రెండు దేశాల మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులే కారణమని చెప్పారు. పాక్ క్రికెటర్లు సుధీర్ఘ కాలం ఐపీఎల్ వంటి టోర్నమెంట్లలో ఆడటానికి ఇష్టపడరని చెప్పారు. తమ దేశం తరుఫున అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడటానికి మొగ్గు చూపుతారని పేర్కొన్నారు.

ఐపీఎల్ టోర్నమెంట్ ను మరింత విస్తరింపచేయడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇదివరకు ఎనిమిది జట్లకే పరిమితమైన ఈ టోర్నమెంట్ ఫ్రాంచైజీల సంఖ్యను 10కి పెంచింది. ఇదివరకూ 60 మాత్రమే మ్యాచ్ లు ఉండగా ఇప్పుడు 74కు చేరింది.

ప్రతి సంవత్సరం ఐపీఎల్ మ్యాచులు పెంచుకుంటూ వెళ్లాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దీనికి ఐసీసీ వద్దకు తీసుకెళ్లనుంది. అదే జరిగితే అంతర్జాతీయ మ్యాచ్ ల సంఖ్య తగ్గుతుందని.. క్రికెట్ ప్రపంచానికి ఇది మంచిది కాదని షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News