రాజ‌కీయ పార్టీల ఉచిత హామీల‌పై సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్‌!

Update: 2022-08-25 10:30 GMT
రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు తీవ్రమైన అంశమని సుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దీనిపై విస్తృత‌ చర్చ జరగాలంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కేంద్రాన్ని నిల‌దీసింది. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని అభిప్రాయ‌ప‌డింది. ఉచిత హామీల విష‌యంలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందంది. అప్ప‌టివ‌ర‌కు ఉచిత వాగ్దానాలు ఆగబోవని తెలిపింది.

రాజ‌కీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల‌పై సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర్ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ పిటిష‌న‌ర్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపిస్తూ.. మూడు ర‌కాల ఉచితాల‌ను నిషేధించాల‌ని కోర్టుకు విన్న‌వించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవి, వివక్ష చూపేవి, ప్రజావిధానానికి విరుద్ధమైన ఉచితాలను నిషేధించాలని కోరారు.

మ‌రోవైపు అధికారంలో లేని రాజకీయపార్టీలే ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు ఉచిత హామీల‌ను ఇస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేప‌థ్యంలో ఉచిత హామీలు తీవ్ర అంశమని సీజేఐ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తెలిపింది.

పిటిషనర్‌ తరపున వాదనలు వినిపించిన మ‌రో న్యాయవాది వికాస్‌సింగ్‌.. ఉచితాలపై ఏర్పాటు చేసే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా.. ఉండాలని విన్నించారు. దీనిపై స్పందించిన ఎన్వీ ర‌మ‌ణ‌ పదవీ విరమణ చేసిన వ్యక్తికి, పదవీ విరమణ చేయబోయే వ్యక్తికి ఈ దేశంలో ఎలాంటి విలువ ఉండదని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

కాగా డీఎంకే, తదిత‌ర పార్టీలు ఉచితాలు తమ హక్కు అని పేర్కొంటూ.. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసిన విషయాన్ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ గుర్తు చేశారు. ఇలాంటి ఉచిత హామీలు ఇచ్చే కొన్ని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చాయ‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా చెప్పారు.

ఈ నేప‌థ్యంలో ఉచిత హామీలు ఇవ్వ‌కుండా తాను ఎన్నిక‌ల్లో పోటీ చేసినా ప‌ది ఓట్లు కూడా రావ‌ని ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2013లో ఇచ్చిన తీర్పుపై.. పునః పరిశీల‌న అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. 2013 తీర్పును పరిశీలించడానికి ముగ్గురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
Tags:    

Similar News