హైకోర్టు జడ్జికి సుప్రీంలో జైలు శిక్ష

Update: 2017-05-09 07:34 GMT
భారత దేశ న్యాయ చరిత్రలో అత్యంత అరుదైన తీర్పు వెలువడింది. ఏకంగా ఒక రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తికే ఆర్నెళ్ల జైలు శిక్ష వేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే... ఆ న్యాయమూర్తి వ్యవహారశైలే ఇలాంటి పరిస్థితులకు దారి తీసిందని స్పష్టమవుతోంది. అంతేకాదు... న్యాయం ముందు న్యాయమూర్తయినా, సాధారణ వ్యక్తులైనా ఒకటేనని తేలింది.
    
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి, ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదుడైన జస్టిస్‌ కర్నన్‌ కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు నిర్ణయించి జైలు శిక్ష విధించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మరికొందరు న్యాయమూర్తులకు జస్టిస్‌ కర్నన్‌ జైలు శిక్ష విధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జస్టిస్‌ కర్నన్‌ కు ఈ శిక్ష  వేసింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఆయన్ని ఈరోజు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.
    
కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌, మరో ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు జస్టిస్‌ కర్ణన్‌ అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ ఎనిమిదిమంది ఎస్సీ - ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలకు పాల్పడ్డారంటూ కర్ణన్‌ సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్న సుప్రీంకోర్టు ...జస్టిస్‌ కర్ణన్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ జైలుశిక్ష విధించింది. తోటి హైకోర్టుల జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బెంచ్‌ కర్ణన్‌ ను విచారించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం జడ్జిలతో కూడిన బెంచ్‌ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్‌ ఆరోపించారు. తన కేసును సుమోటోగా తీసుకుని న్యాయపరమైన, చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన విమర్శించారు.


Tags:    

Similar News