రిజ‌ర్వేష‌న్ల మంట‌లు..మంత్రి ఇంటి ముందు ఉద్రిక్తత

Update: 2017-12-04 04:01 GMT
ముచ్చ‌ట‌గా మూడున్న‌రేళ్ల త‌ర్వాత త‌న ఎన్నిక‌ల హామీల‌ను నిలుపుకునేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ముంద‌డుగు వేస్తే...అది కాస్త అనేక ట్విస్టుల‌కు వేదికగా నిలుస్తోంది. సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన కాపులు - వాల్మీకి రిజ‌ర్వేష‌న్ హామీతో...ఏపీలో రిజర్వేషన్ల మంటలు ఎగిసిపడుతున్నాయి. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని ఆ వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ...అనంతపురంలో ఎస్టీ నేతలు మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటిని ముట్టడించారు. అదే సమయంలో వాల్మీకి సంఘ నాయకులు సైతం మంత్రి ఇంటికి చేరుకోవడంతో ఉత్కంఠ నెల‌కొంది.

ఇటు వాల్మీకి సంఘం నేత‌లు - అటు ఎస్టీ నేత‌లు ప‌ర‌స్ప‌రం నినాదాలు ఇస్తూ ముందుకు వెళుతుండ‌టంతో..ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువ‌ర్గాలు ఒకరిని మ‌రొక‌రు తోసుకోవ‌డంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేయాల్సి వ‌చ్చింది. ఇరు వర్గాలతో చ‌ర్చించిన పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా త‌మ అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లాల‌ని కోరారు.

మ‌రోవైపు ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లు - బీసీ సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. మంజునాథ క‌మిష‌న్‌ వివాదంపైనా నేతలకు సూచనలు చేశారు. అంతా సమన్వయం చేసుకోవాలని, కళా వెంకట్రావ్ - అచ్చెన్నాయుడు - టీడీ జనార్ధన్‌ లకు బాధ్యతలు అప్పగించారు. ఏ వర్గానికీ అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. రిజర్వేషన్‌ పై చాలా కాలంగా ఉన్న డిమాండ్‌ ను నెరవేర్చామని ప్ర‌చారంలో పెట్టాల‌ని చంద్రబాబు వివ‌రించారు. నిబంధనల ప్రకారమే కాపు రిజర్వేషన్ల బిల్లును సభలో ప్రవేశపెట్టామని, బీసీ కమిషన్‌ లోని మెజార్టీ సభ్యుల నివేదిక ఆధారంగా కాపు రిజర్వేషన్లపై నిర్ణయించామనే విష‌యాన్ని తెలియ‌జెప్పాల‌ని బాబు ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీసీ సంఘ నేత - టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చేసిన విమర్శలను పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆ విష‌య‌మై త్వ‌ర‌లో చ‌ర్చిద్దామ‌ని అన్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News