కేసీఆర్ విస్కీ..తెలంగాణ‌లో కొత్త స్కీం

Update: 2017-07-15 10:49 GMT
తెలుగురాష్ట్రాల ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు - కే చంద్ర‌శేఖ‌ర్ రావుపై ఏఐసీసీ కార్యదర్శి వీ హ‌నుమంత‌రావు మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా వివాదంలో చిక్కిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్‌ పై ప్ర‌త్యేక ప్రేమ‌ను చాటుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన సాగుతోందని వీహెచ్ ఆరోపించారు. చంద్రబాబు - కేసీఆర్ లు నియంతలుగా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నిర్మించింది ప్రజల కోసమా...లేఖ త‌న మనమడి కోసమా అనేది వెల్ల‌డించాల‌ని వీహెచ్ కోరారు. సామాన్య జనాలు సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్లి నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడ గవర్నర్ కు పట్టడం లేదని మండిప‌డ్డారు.

తెలిసో తెలియకనో తప్పు చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ త‌మ పార్టీ నాయ‌కుడు - రాష్ట్ర  ముఖ్య‌మంత్రి అయిన‌ సీఎం కేసీఆర్‌ ను కలిసేందుకు వెళ్ళితే కలవకుండా అవమానించడం సరికాదని వీహెచ్ అన్నారు. గిరిజనులపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమకు ఇది అద్దం పడుతోందని అన్నారు. చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో ఎంద‌రో ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ గిరిజ‌నుడిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని వీహెచ్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరగడానికి ప్రభుత్వమే కారణమ‌ని వీహెచ్ మండిప‌డ్డారు. రాష్ట్రంలో వైన్ షాప్ లు .. పబ్ లను ఎందుకు సర్కార్ అరికట్టడం లేద‌ని ప్ర‌శ్నించారు. వైన్స్ లను ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రోత్సహించడం దుర్మార్గమ‌ని అన్నారు. ఆఖరుకు రాష్ట్రంలో కేసీఆర్ విస్కీ కూడా తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ కేసులో పెద్ద పెద్ద తిమింగళాలను ఎందుకు వదిలిపెడుతున్నార‌ని ప్ర‌శ్నించారు.

ఏపీలో ముద్రగడ పాదయాత్రను చంద్రబాబు సర్కార్ అనుమతించకపోవడం నియంతృత్వమ‌ని వీహెచ్‌ మండిప‌డ్డారు. కాపుల హక్కుల సాధనకు ముద్రగడ పాదయాత్ర చేస్తానంటే తప్పేముందని ప్ర‌శ్నించారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవ‌డం బాబు సర్కార్ పతనానికి నాంది అవుతుందని వీహెఛ్‌ అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్‌ జగన్ పాదయాత్రకు అనుమతి ఇచ్చిన చంద్ర‌బాబు.. బీసీ నేత పాదయాత్ర చేస్తానంటే అనుమతివ్వరా అని వీహెచ్ ప్ర‌శ్నించారు. పాదయాత్రను అడ్డుకుంటే శాంత్రిభద్రతల సమస్య తలెత్తడం ఖాయమ‌ని జోస్యం చెప్పారు. కాపుల మద్దతుతోనే అధికారంలోకి వచ్చినాననే విషయాన్ని చంద్రబాబు మరిచిపోవద్దని అన్నారు.
Tags:    

Similar News