వివేకా హత్య కేసు దెబ్బకు ఏపీ పోలీసుల పరువు సర్వనాశనం

Update: 2022-10-22 05:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన వైఎస్ వివేకా దారుణ హత్య కేసు విచారణ పుణ్యమాఅని.. ఏపీ పోలీసుల ఇమేజ్ మొత్తం సర్వనాశనమైందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ కేసు విచారణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు.. పలువురు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు దెబ్బకు ఇంతకాలం ఉన్న పరువు.. ప్రతిష్ఠలకు దారుణమైన డ్యామేజ్ జరిగిందన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.

ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే ఉండే ఇమేజ్ కు.. వివేకా హత్య కేసు పుణ్యమా అని మారిన పరిస్థితులతో ఏపీ పోలీస్ పరువు ప్రతిష్టలు మొత్తం దెబ్బ తిన్నట్లుగా మాజీ పోలీసు అధికారుల నోట వినిపిస్తోంది. వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనుకుంటున్న విషయాన్ని సుప్రీంకు సీబీఐ నివేదించింది. అంతేకాదు.. సాక్ష్యులను విచారిస్తున్న సీబీఐ అధికారులకు ఏపీలో బెదిరింపులు ఎదురుకావటం.. వారు ఇచ్చిన కంప్లైంట్లను పోలీసులు కేసులుగా నమోదు చేయకపోవటం షాకింగ్ గా మారింది.

ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. సీబీఐ అధికారులకు ఏపీలో బెదిరింపులు ఎదురవుతున్న నేపధ్యంలో విచారణ సాఫీగా సాగేందుకు వీలుగా.. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనుకుంటున్న విషయాన్ని సుప్రీం తాజాగా వెల్లడించటం తెలిసిందే. అంతేకాదు.. ఈ సందర్భంగా ఏపీ పోలీసుల ఏకపక్ష.. పక్షపాత ధోరణిని ప్రస్తావించటం గమనార్హం.

సీబీఐ దర్యాప్తు అధికారిని నిందితులు బెదిరించటాన్ని సుప్రీంను సైతం విస్మయానికి గురి చేసింది. వివేకాహత్య కేసు నిందితులతో ఏపీ పోలీసులు కుమ్మక్కుయ్యారంటూ వ్యాఖ్యానించారు. సాక్ష్యులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని.. సాక్ష్యులకుప్రత్యేక భద్రత అవసరమైందన్న ఒక్క అంశం చాలు.. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయటానికి అంటూ సుప్రీం పేర్కొంది. సీబీఐ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలన్నీ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వైపే వేలెత్తి చూపేలా ఉన్నాయి.

వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారికి పోలీసులు సహకారాన్ని అందించకపోవటమే కాదు.. అనుమానితులు కంప్లైంట్ ఇచ్చారని.. సీబీఐ విచారణ అధికారి మీదనే కేసు నమోదు చేసిన ఘనతను ఏపీ పోలీసులు చేసిన వైనంపైనా సుప్రీం విస్మయాన్ని వ్యక్తం చేసింది. కడప వదిలి పారిపోకపోతే.. బాంబులు వేసి చంపేస్తామని సీబీఐ కారు డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశంపై పోలీసుల్నిసంప్రదించి కంప్లైంట్ ఇస్తే కడప పోలీసులు కేసు పెట్టకపోవటం గమనార్హం.

అంతేకాదు.. సీబీఐ డ్రైవర్ ఇచ్చిన కంప్లైంట్ తప్పు.. ఉత్తదేనని తేల్చారని సమాధానం ఇస్తున్నారు. ఈ తరహా ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఏపీ పోలీసుల ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా ఏపీ పోలీసుల ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన కీలక కేసుగా వైఎస్ వివేకా హత్య ఉదంతం నిలుస్తుందన్నమాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News